
అహల్య బాయి త్రిశతాబ్ది జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం
రాయచోటి టౌన్ : అహల్య బాయి హోల్కర్ త్రి శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుందామని కేంద్ర సమాచార ప్రసార శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి ఎల్.మురుగున్ పేర్కొన్నారు. గురువారం రాయచోటి సాయి సుధ కల్యాణ మండపంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ ఆధ్వర్యంలో ఈ నెల 31వతేదీన జరిగే త్రి శతాబ్ది జయంతి వేడుకల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆమె కాశీ నుంచి కన్యాకుమారి వరకు దేవాలయాల పునర్నిర్మాణానికి చేసిన కృషి అమోఘమైనదన్నారు. బాల్య వివాహాల నిర్మూలన కోసం కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జకియా ఖానం, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సునీత నారాయణ వర్మ తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక కేంద్రంగా మాతంగి మహా పీఠం
రాయచోటి టౌన్ : లక్కిరెడ్డిపల్లె మండలంలోని మాతంగి మహా పీఠం అధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ, పార్లమెంట్ వ్యవహారాల సహాయ మంత్రి మురుగన్ అన్నారు. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య శ్రీ శారద లక్ష్మి నరసింహా పీఠాధిపతులు స్వయంప్రకాశ సచ్చిదానంద స్వామి సరస్వతి సంకల్పం మేరకు లక్కిరెడ్డిపల్లెలోని దొర్రిచెరువు సమీపంలో శ్రీమాతంగి మహాపీఠ శిల శాస్త్ర ప్రతిష్టకు ఆయన హాజరయ్యారు. ముందుగా రాయచోటిలోని స్టేట్ గెస్ట్ హౌస్లో అల్పాహారం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ మహా పీఠం ప్రపంచానికి ఆధ్యాత్మికను నేర్పి ఆది గురువుగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో కర్నాటక రాష్ట్ర ఆహార, ప్రజా సరఫరాల శాఖ మంత్రి కెహెచ్ మునియప్ప, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.