మదనపల్లె రూరల్ : పట్టణంలోని చంద్రాకాలనీలో చోరీ జరిగిన విషయం గురువారం వెలుగుచూసింది. స్థానికంగా ఉండే కుమార్ కుటుంబంతో కలిసి ఈనెల 21న బంధువుల ఇంటికి కడపకు వెళ్లాడు. బుధవారం రాత్రి తిరిగి ఇంటికి రాగా తలుపులు, తాళాలు పగలగొట్టి ఉండటంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనలో రూ.60వేల విలువచేసే బంగారు నగలు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుని వెళ్లినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామచంద్ర తెలిపారు.
భూ తగాదా కేసులో ఆరుగురి అరెస్టు
చాపాడు : మండల పరిధిలోని రాజుపాళెం గ్రామంలో జరిగిన భూ తగాదా కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. పల్లెం శ్రీనివాసులు, మహేష్ బాబు, వెంకట రమణ, వెంకటసుబ్బయ్య, సురేష్, సతీష్ కుమార్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.
నలుగురిపై తేనెటీగల దాడి
సిద్దవటం : మండల కేంద్రమైన సిద్దవటంలోని గురుకుల కళాశాల సమీపంలో గురువారం నలుగురు వ్యక్తులపై తేనెటీగలు దాడిచేశాయి. సిద్దవటం ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని గురుకుల కళాశాల వద్ద ఉన్న తేనె తుట్టైపె ఆకతాయిలు రాళ్లు వేశారు. దీంతో అవి ఒక్కసారిగా బయటకు వచ్చాయి. రహదారి వెంబడి వెళుతున్న వారిపై దాడిచేసి గాయపరిచాయి. ఈ దాడిలో జంగాలపల్లె, మూలపల్లె, సిద్దవటం, భాకరాపేట గ్రామాలకు చెందిన వెంకటబాలాజీ, మల్లికార్జున, అమీర్ బాషా, మరొకరు గాయపడ్డారు. వీరికి సిద్దవటం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ప్రకాష్ ఆధ్వర్యంలో చికిత్స చేశారు. వైద్యాధికారి డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ తేనెటీగలు నలుగురిని బలంగా కుట్టడం వల్ల భాకరాపేట గ్రామానికి చెందిన అమీర్బాషా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
కాశినాయన : మండలంలోని జ్యోతిక్షేత్రం సమీపంలోని గరుడాద్రి వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కాశినాయన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా అప్పటికే గుర్తు పట్టలేని విధంగా ఉంది. పోరుమామిళ్ళ వైద్యాధికారి కరీమ్ ఘటన స్థలానికి వచ్చి పోస్టుమార్టం చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.