
కూటమి సర్కార్లో వ్యవస్థలు నిర్వీర్యం!
సాక్షి ప్రతినిధి, కడప: అపార అనుభవం అని చెప్పుకుంటూ వ్యవస్థలు నిర్వీర్యం చేశారు. ప్రజా సంక్షేమం లేదు. రైతులకు గిట్టుబాటు ధరల్లేవు. పెట్టుబడి నిధి లేదు. కొత్తగా ఒక్క ఉద్యోగం లేదు. ప్రవేటు సెక్టార్ అభివృద్ధి లేదు. ప్రజలకు చేయూతగా ఉన్న వాలంటీరు వ్యవస్థ లేదు. విద్యా దీవెన, వసతి దీవెన నిలిచిపోయాయి. మహిళలకు చేయూత ఆగిపోయింది. కాపు నేస్తం లేదు. చెప్పినవి ఇవ్వలేదు. ఇచ్చేటివి ఇవ్వలేదు. ప్రజాస్వామ్యం అసలే లేదని కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ చీఫ్విఫ్ గడికోట శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ 10 నెలల పాలనపై ఆయన సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళకు రూ.15వేలు బకాయి పడింది. కొత్తగా ఒక్క పెన్షన్ లేదు, రైతులు, మహిళలు, ఉద్యోగులు అన్నీ వర్గాలను చంద్రబాబు సర్కార్ మోసం చేసిందని ఆయన దెప్పిపొడిచారు.
మా పాలన ప్రజాశ్రేయస్సుకే అంకితం...
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలు ప్రజలకు దగ్గరగా వారి శ్రేయస్సుకు అనుగుణంగా ఉండేవి. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల చెంతకు పాలన తెచ్చారు. రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి, రైతులకు అండగా నిలిచారు. హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజల బాబోగులు చూశారు. ఆరోగ్యశ్రీ రూ.20 లక్షలకు పెంచి ప్రజల భద్రతగా నిలిచారు. ఆర్థికంగా అండగా నిలిచారు. ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా చిత్తశుద్ధితో సంక్షేమం అమలు చేశారు. ఇలాంటివి జనం ఊహించుకోలేదు. ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతోంది. అప్పటికి.. ఇప్పటికీ తేడా, వారు కోల్పోయినా సంక్షేమం అన్నీ గమనిస్తున్నారు. అధికారం ఉందని ఇప్పుడు ఎగిరెగిరి పడే వారి కుటుంబాలకు కూడా సంక్షేమం అందేది. పూర్తిగా ప్రజా శ్రేయస్సుకు అంకితమై పాలన కొనసాగిందని శ్రీకాంత్రెడ్డి వివరించారు.
ఉపయోగం లేని మంత్రిత్వ హోదా...
రాయచోటి నియోజకవర్గానికి తొలిసారి మంత్రి హోదా లభించినా ఇక్కడి ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఇంతకాలం జిల్లా కేంద్రానికి నడిబొడ్డున రాయచోటి ఉంది, కాబట్టే జిల్లా ఇచ్చారని చెప్పుకున్నారు. పార్లమెంట్కు కూడా సెంటర్ పాయింటే, మరీ ఇవ్వలేదని ఆయన ధ్వజమెత్తారు. 70ఏళ్లుగా పాలనలో ఆర్డీఓ, డీఎస్పీ కార్యాలయాలు కూడా పెట్టలేని దుస్థితి ఉండిపోయింది. రాయచోటిని జిల్లా కేంద్రం చేసి ఎన్నో రంగాలల్లో అభివృద్ధి చేశాం. 15 సంవత్సరాల క్రితమే రూ.64కోట్లతో ఫోర్లైన్ రింగురోడ్డు ఏర్పాటు చేశాం. రూ.15వేల కోట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం లభించింది. రాయచోటికి సంపద సృష్టించాం. జిల్లా కేంద్రం ఇన్ఫ్రాస్ట్రక్షర్ అభివృద్ధి చేశాం. చుట్టూ 35 కిలోమీటర్లు పరిధిలో ప్రతి వ్యక్తి ఆస్తి 3రెట్లు అధికంగా పెరిగాయి. ఈ పదినెలల కాలంలో రియల్ ఎస్టేట్ కుప్ప కూలింది. సామాన్యులు చితికిపోయారు. వ్యాపార వర్గాలవారు చిన్నాభిన్నమయ్యారు. ఎటుచూసినా ఏరకమైనా అభివృద్ధి కన్పించలేదు. మంత్రి హోదా లభించడం వల్ల నియోజకవర్గానికి ఎలాంటి ప్రయోజనం లభించలేదని మాజీ చీఫ్విఫ్ గడికోట శ్రీకాంత్రెడ్డి తెలిపారు.
సహాజ వనరులు దోపిడీ....
ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ప్రజాస్వామ్య విలువలు దిగజారిపోయాయి. ప్రభుత్వ అధికారులను అడ్డుపెట్టుకొని సహజ వనరుల దోపిడీ చేస్తున్నారు. ఈమాట ప్రతి నోటా వినిపిస్తోంది. రెవెన్యూ, పోలీసుశాఖలను అడ్డుపెట్టుకొని నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు కంట కన్పిస్తోంది. భూ ఆక్రమణలు అధికమయ్యాయి. చాలామంది బాధితులు మాట్లాడుతున్న విషయం చూస్తున్నాం. మాపాలనలో ఐదేళ్లు ప్రభుత్వం ద్వారా సేకరించిన భూమి ప్రజల ఆస్తిగా సృష్టించాం. 100 ఎకరాల్లో కలెక్టరేట్, 11ఎకరాల్లో శిల్పారామం, 25 ఎకరాల్లో స్టేడియం, 45ఎకరాల్లో ఎకోపార్క్, జిల్లా పరిషత్కు 11 ఎకరాలు, రెసిడెంట్ బంగళాల కోసం తీర్చిదిద్దాం. ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తిగా చేశాం. మా ప్రభుత్వ ఐదేళ్లు మాపాలన అలా ఉంటే, మంత్రి కుటుంబ సభ్యులు, అనుచరులు సహాజ వనరులు దోపిడీ చేస్తున్నారు, భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు.
చట్టాలపై నమ్మకం లేకుండా పోతుంది...
మాజీ ఎమ్మెల్యే రమేష్రెడ్డి ప్రాపర్టీ దొంగతనం చేస్తే ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యల్లేవు. లక్కిరెడ్డిపల్లె జడ్పీటీసీ ఇంటిపై దాడి చేస్తే చర్యల్లేవు. అధికారం అండతోనే ఇవన్నీ చేశారు. చట్టాలు, పోలీసులపై నమ్మకం పోతుంది. మాజీ ఎమ్మెల్యే ఆస్థికే ప్రొటెక్షన్ లేదు. మాండవ్య నదీ లూఠీ అవుతోంది. వందల టిప్పర్లు రింగు రోడ్డులో వెళ్తున్నాయి. ట్రాన్సుపోర్టు మంత్రిగా ఉంటూ అక్రమంగా వందలాది టిప్పర్లు మెటీరియల్తో నిర్భయంగా పోతుంటే దేనికి సంకేతం. మంత్రి అనుచరులు గ్యాంబ్లింగ్ కొనసాగిస్తున్నారు. కాని స్టేబుల్జూదం ఆడిస్తూ పట్టుబడ్డారు. లక్షలాది రూపాయాలు చేతులు మారుతున్నాయి. బెల్ట్షాపులు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. రాజకీయ అండదండలతో ఆసాంఘిక కార్యక్రమాలు అధికమైయ్యాయని శ్రీకాంత్రెడ్డి వాపోయారు.
మంత్రికి కప్పం కట్టాల్సిందే..
రాయచోటిలో ఎన్నడూ లేనివిధంగా కప్పం కట్టాల్సిన రోజులు దాపురించాయి. క్రషర్ యజమానులు మంత్రి కుటుంబసభ్యులకు నెలవారి కప్పం కట్టుతున్నారు. గతంలో ఈసంస్కృతి ఎన్నడూ లేదు. ఇలాంటి పరిస్థితులుంటే ఏకరంగా ఇక్కడికి పరిశ్రమలు వస్తాయి, పారిశ్రామికవేత్తలు వస్తారు. శిబ్యాల వద్ద 500 ఎకరాలు ఏపీఐఐసీ కోసం అప్పట్లో సిద్ధం చేశాం, బహిష్కరించారు. చివరకు ఉపాధి హామీ పనులు కూడా పారదర్శకంగా చేపట్టడం లేదు. ఎన్ఆర్జీఈఎస్ కూడా దోపిడీ దాయకంగా సాగుతోంది. చట్టాన్ని నిర్వీర్యం చేయడం, దోపిడీ చేయడం ప్రతి గ్రామంలో ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు.
ప్రజాశ్రేయస్సే ధ్యేయంగావైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన
చంద్రబాబు సర్కార్లో ప్రజాస్వామ్యంకంటే వ్యక్తులకే ప్రాధాన్యత
తొలిసారి మంత్రి పదవి హోదా దక్కినా నియోజకవర్గ ప్రయోజనం నిల్
దోపిడీలు, దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు, అరాచకాలకే ప్రాధాన్యత
చితికిపోయినా సామాన్యులు, చిన్నభిన్నమైన వ్యాపార వర్గాలు
ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి

కూటమి సర్కార్లో వ్యవస్థలు నిర్వీర్యం!