
ఇళ్లు మావి... పరిహారం వేరొకరికా..?
మదనపల్లె : 21 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన పట్టా ఇళ్ల స్థలాలను ఆర్వోబీ నిర్మాణానికి తీసుకుని, పరిహారం వేరొకరికి ఇవ్వడమేంటని నిర్వాసితులు శనివారం సీటీఎంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ...సీటీఎం గంగమ్మగుడి ఎదుట 21 ఏళ్ల క్రితం ఇళ్ల స్థలాలను లలితకుమారి నుంచి తాము కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకుని అందులో నివసిస్తున్నామన్నారు. సీటీఎం వద్ద నిర్మిస్తున్న రైల్వే ఓవర్బ్రిడ్జ్(ఆర్ఓబీ) నిర్మాణానికి ఇళ్ల స్థలాలు అవసరమై తమకు నోటీసులు అందజేశారన్నారు. అయితే నష్టపరిహారం మాత్రం తమకు అందివ్వకుండా తమకు ఇళ్ల స్థలాలు విక్రయించిన లలితకుమారికి ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారన్నారు. డబ్బులు చెల్లించి తాము కొనుగోలుచేసి, అనుభవంలో ఉంచుకున్న స్థలాలను ఆర్వోబీ నిర్మాణానికి ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని, అయితే పరిహారం తమకే చెల్లించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారులు తమకు అన్యాయం చేస్తే ఆర్వోబీకి ఇళ్ల స్థలాలు ఇచ్చేది లేదన్నారు. కార్యక్రమంలో బాధితులు వై.రెడ్డిశేఖర్, రెడ్డెప్ప, శ్రీనివాసులు, పాపులమ్మ, సి.చంద్రశేఖర్, ఎస్.రాజశేఖర్, వేణునాయుడు పాల్గొన్నారు.