Andhra Pradesh: జనపథం.. జగన్‌ మార్గం

YS Jagan Praja Sankalpa Yatra ended this day Three years back - Sakshi

వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ముగిసి నేటికి మూడేళ్లు

‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ నాడు భరోసా

ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం కట్టబెట్టిన ప్రజలు

చెప్పిన మాటను చెప్పినట్లు ఆచరిస్తూ నేడు అన్ని వర్గాల వారికి ఊతం

విప్లవాత్మక నిర్ణయాలు, పథకాలతో ఆచరణలో సామాజిక న్యాయం

సాక్షి, అమరావతి: ప్రజల కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ.. భవితపై భరోసా కల్పిస్తూ నేటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సాగించిన ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తయి నేటికి మూడేళ్లు. జన జీవనాన్ని దుర్భరంగా మార్చిన టీడీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడి.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే రాజన్న రాజ్యం సాధనే లక్ష్యంగా 2017 నవంబర్‌ 6న పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

వైఎస్సార్‌ కడప జిల్లాలోని ఇడుపులపాయలోని దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి  తొలి అడుగు వేశారు. ప్రజల సమస్యలు వింటూ.. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తూ.. జనంలో ఆత్మస్థైర్యం నింపారు. ఎముకలు కొరికే చలిలో.. మండే ఎండల్లో.. కుండపోత వర్షాల మధ్య 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల దూరం సాగిన పాదయాత్ర 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగిసింది.

చారిత్రక విజయంతో ప్రజారంజక పాలన
► పాదయాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో 151 శాసనసభ స్థానాల్లో, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌.. రాజన్న రాజ్యానికి అదే రోజే పునాది వేశారు.
► ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొలి ఏడాదే 95 శాతం అమలు చేశారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ.. సంక్షేమ పథకాల ద్వారా 1.16 లక్షల కోట్లను నేరుగా పేదల ఖాతాల్లో జమ చేశారు. 
► వివిధ ఎన్నికల్లో, నామినేటెడ్‌ పోస్టుల్లో, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి 50 శాతానికిపైగా కేటాయించి.. సామాజిక న్యాయానికి అసలు సిసలు నిర్వచనం చెప్పారు. అందులో 50 శాతం మహిళలకు ఇవ్వాలని చట్టం చేశారు. తద్వారా వరుస ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు.  
► వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చి వేసిందని ఎమ్మెల్సీ, సీఎం ప్రోగ్రామ్స్‌ కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురాం పేర్కొన్నారు. 13 జిల్లాల మీదుగా 134 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 2,516 గ్రామాలను తాకుతూ 341 రోజుల పాటు యాత్ర సాగిందని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top