సింహాచలం భూములపై విజిలెన్స్‌ విచారణ | Vigilance Inquiry Into Simhachalam And Mansas Lands | Sakshi
Sakshi News home page

సింహాచలం భూములపై విజిలెన్స్‌ విచారణ

Aug 16 2021 5:11 PM | Updated on Aug 17 2021 8:16 AM

Vigilance Inquiry Into Simhachalam And Mansas Lands - Sakshi

సింహాచలం (పెందుర్తి): సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి క్షేత్రానికి చెందిన భూములను టీడీపీ హయాంలో రికార్డుల నుంచి తొలగించిన వ్యవహారంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ చేపట్టింది. ఆలయ ఈవో కార్యాలయంలో సోమవారం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడిషనల్‌ ఎస్పీ స్వరూపారాణి ఆధ్వర్యంలో డీఎస్పీ అన్నెపు నరసింహమూర్తి, సీఐ తిరుపతిరావు భూముల రికార్డులను పరిశీలించారు. ఈ అడ్డగోలు వ్యవహారంపై దేవదాయ శాఖ నియమించిన కమిటీ దర్యాప్తు నిర్వహించి, రికార్డులను పరిశీలించిన విషయం విదితమే.

అప్పట్లో ఆస్తుల రికార్డుల నుంచి తొలగించిన 862.22 ఎకరాల్లో కొన్ని భూములు ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో సింహాచలం దేవస్థానం పేరిట ఉన్నట్టు గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో భూముల వ్యవహారంపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించగా.. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం రంగంలోకి దిగారు. మాన్సాస్‌ భూములపైనా ఈ విభాగం విచారణ చేయనుంది.


మూడు నెలల్లోగా నివేదిక
సింహాచలం దేవస్థానం, మాన్సాస్‌ భూముల అవకతవకలపై పూర్తి విచారణ జరిపి మూడు నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడిషనల్‌ ఎస్పీ స్వరూపారాణి తెలిపారు. ప్రాథమికంగా వివిధ రికార్డులను పరిశీలించామని, కొన్ని రికార్డులను విజిలెన్స్‌ కార్యాలయానికి  తీసుకెళ్లి పరిశీలిస్తామని చెప్పారు. అవకతవకలు జరిగిన భూములను స్వయంగా పరిశీలిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement