త్రీమెన్ కమిటీ నివేదిక.. గల్లంతైన మత్స్యకారులు మృతి | Three-member committee report on the Visakhapatnam boat accident | Sakshi
Sakshi News home page

త్రీమెన్ కమిటీ నివేదిక.. గల్లంతైన మత్స్యకారులు మృతి

Jul 8 2026 3:30 PM | Updated on Jul 8 2026 4:22 PM

Three-member committee report on the Visakhapatnam boat accident

విశాఖ: బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారులు మృతిచెందారంటూ త్రీమెన్ కమిటీ నివేదిక అందించింది. గల్లంతైన ఆరుగురు మత్య్సకారులు మృతిచెందినట్లు త్రీమెన్ కమిటీ నిర్ధారించింది. ఇటీవల గల్లంతైన మత్య్సకారులపై విచారణ చేపట్టిన కమిటీ.. మత్య్సకారులు ప్రమాదంలో మరణించినట్లు నివేదిక ఇచ్చింది. త్రీమెన్ కమిటీ విచారణ పూర్తి చేసిన తరుణంలో మృతదేహాల గురించి ఎటువంటి స్పష్టత లేకుండానే సెర్చ్‌ ఆపరేషన్ ముగించినట్లయ్యింది.

కాగా, మూడు రోజుల క్రితం సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. రాకాసి అలల తాకిడికి బోటు బోల్తా పడటంతో ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ ప్రమాదం నుంచి కారె చిన్నా అనే మత్స్యకారుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడగా, మిగిలిన ఆరుగురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గల్లంతైన మిగిలిన మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు.

అదే సమయంలో సెర్చ్‌ ఆపరేషన్‌  మంగళవారం(జూలై 7వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందంటూ  ఫిషరీస్‌ కమిషనర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో నిన్న రాత్రి 12 గంటల వరకూ సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తామని కంటి తుడుపు చర్యలు చేపట్టారు. ఈ రోజు(బుధవారం, జూలై 8వ తేదీ) గల్లంతైన మత్స్యకారులు మృతిచెందారంటూ నిర్దారించడంతో ప్రభుత్వం చేతులెత్తేసినట్లయ్యింది.  

ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి కొల్లు రవీంద్రను మత్స్యకారులు అడ్డుకున్నారు. గల్లంతైన మత్స్యకారులు ఇంకా ఆచూకీ లభించకపోగా, మత్స్యకారులు ఇక లేరని నిర్ధారించాం’అంటూ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.  

దీంతో వారి ఆచూకీ తెలియజేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. మంత్రి కొల్లు రవీంద్ర కాన్వాయ్‌ను మత్స్యకారులు అడ్డుకోగా, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు బలవంతంగా పక్కకు లాగడంతో హార్బర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement