TDP Leader Chundru Sri Vara Prakash Role In Murder Case - Sakshi
Sakshi News home page

హత్య కేసులో టీడీపీ నేత కీలక పాత్ర

Published Mon, Jan 9 2023 7:02 AM

TDP leader Leader Chundru Sri Varaprakash Role In Murder Case - Sakshi

మండపేట: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేటలో సంచలనం కలిగించిన ఫొటోగ్రాఫర్‌ హత్య కేసులో టీడీపీకి చెందిన మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ చుండ్రు శ్రీవరప్రకాష్‌ ప్రధాన నిందితునిగా పోలీసులు నిగ్గుతేల్చారు. ఫొటోగ్రాఫర్‌ను మట్టుబెట్టేందుకు నిందితులతో రూ.2 లక్షలకు డీల్‌ కుదుర్చుకున్నట్లు విచారణలో వెల్లడైంది. 

కాగా, పట్టణానికి చెందిన ఫొటోగ్రాఫర్‌ కుంజాల సురేష్‌(26) డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి స్నేహితునితో బయటకు వెళ్లి మృతిచెందాడు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా హత్యకేసుగా మార్పుచేశారు. హత్యకు పాల్పడిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. హతుడు సురేష్‌ భార్య దుర్గాభవాని, అతని తల్లి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ శ్రీవరప్రకాష్‌ ఇంట్లో పనిచేసేవారు. భార్యపై అనుమానం పెంచుకున్న సురేష్‌ ఆమెను వేధించేవాడు. ఈ విషయాన్ని అత్తతో కలిసి భవాని శ్రీవరప్రకాష్, అతని అనుచరులు కోరా గోవింద్, బుంగా సంజయ్‌లకు చెప్పింది. 

ఈ నేపథ్యంలో.. సురేష్‌ను హత్య చేయించేందుకు వారు పథక రచన చేశారు. మాజీ చైర్మన్‌ కారు డ్రైవర్‌ శెట్టి వీర వెంకటేశ్వరరావు, గునుపల్లి నాగ సాయికృష్ణ ప్రసాద్, మారి శ్రీనులతో రూ.2 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. అప్పటికే సురే‹Ùకు కారు డ్రైవర్‌ వెంకటేశ్వరరావుతో పరిచయం ఉంది. దీంతో మద్యం తాగేందుకని 31వ తేదీ రాత్రి సురేష్‌ను వెంకటేశ్వరరావు తన వెంట తీసుకువెళ్లాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం మద్యంలో విషం కలిపి తాగించాడు. అప్పటికీ మృతిచెందక పోవడంతో పీకపై కాలితో తొక్కి హత్యచేసినట్లు పట్టణ సీఐ పి.శివగణేష్‌ ఆదివారం రాత్రి మీడియాకు తెలిపారు. నిందితుల్లో వెంకటేశ్వరరావు, సాయికృష్ణ ప్రసాద్‌లను అరెస్టుచేసి, ఆదివారం కోర్టులో హాజరుపర్చారు. మాజీ చైర్మన్‌తో పాటు పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. 

Advertisement
Advertisement