22లోగా 2వ దశ స్కూళ్ల మ్యాపింగ్‌ | Phase 2 mapping of schools within 22nd January in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

22లోగా 2వ దశ స్కూళ్ల మ్యాపింగ్‌

Jan 21 2022 6:00 AM | Updated on Jan 21 2022 2:13 PM

Phase 2 mapping of schools within 22nd January in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల మ్యాపింగ్‌ రెండో దశను ఈనెల 22వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా విద్యా శాఖాధికారులు, ప్రాంతీయ సంచాలకులకు పాఠశాల విద్యా శాఖ సర్క్యులర్‌ జారీ చేసింది. నూతన విద్యా విధానం ప్రకారం పాఠశాల విద్యలో ఫౌండేషన్‌ విద్యా విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని హైస్కూళ్లలో కలుపుతున్నారు. మొదటి దశలో ఒక కిలోమీటర్‌ పరిధిలో ఉన్న స్కూళ్ల మ్యాపింగ్‌ పూర్తయినందున అదే తరహాలో 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల పరిధిలోనివి, ఆపైబడి ఉన్న దూరంలోని స్కూళ్ల మ్యాపింగ్‌ చేపట్టాలని పాఠశాల విద్యా శాఖ తాజాగా ఆదేశాలు ఇచ్చింది.

స్కూళ్లు, విద్యార్థుల సంఖ్య, టీచర్లు, మౌలిక సదుపాయాల వివరాలు, ప్రత్యామ్నాయాలపై కసరత్తు చేయాలని సూచించింది. ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీ స్కూళ్లను సమీపంలోని హైస్కూళ్ల హెడ్మాస్టర్‌ లాగిన్‌ ద్వారా మ్యాపింగ్‌ చేయాలని పేర్కొంది. సహజసిద్ధమైన అడ్డంకుల వల్ల మ్యాపింగ్‌కు వీలుకాని వాటికి కారణాలను స్పష్టంగా పేర్కొనాలని తెలిపింది. ప్రభుత్వ, ఎంపీపీ, జెడ్పీపీ, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలను మ్యాపింగ్‌ చేసేటప్పుడు ఏ యాజమాన్య స్కూలునైనా పరిగణనలోకి తీసుకోవచ్చని వివరించింది. ఎయిడెడ్, రెసిడెన్షియల్‌ స్కూళ్లను మాత్రం దీని నుంచి మినహాయించింది.

దూరాన్ని వాస్తవిక రోడ్‌ కనెక్టివిటీ ఆధారంగా చూడాలని, స్ట్రయిట్‌ లైన్లు, ఏరియల్‌ వ్యూ ఆధారంగా చేయవద్దని స్పష్టం చేసింది. ఉర్దూ, ఒడియా, తమిళ్, కన్నడ మాధ్యమ స్కూళ్లను అవే మీడియం స్కూళ్లకు మ్యాపింగ్‌ చేయాలంది. సమానమైన దూరంలో రెండు హైస్కూళ్లు ఉంటే మౌలిక సదుపాయాలు ఎక్కువగా ఉన్న వాటిని ఎంచుకోవాలని తెలిపింది. మూడు కిలోమీటర్ల పరిధిలో హైస్కూళ్లు లేని ప్రాంతాల్లోని అప్పర్‌ ప్రైమరీ స్కూళ్లలో మౌలిక సదుపాయాలను అనుసరించి అప్‌గ్రేడ్‌ చేయాలని పేర్కొంది. టీచర్లకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలు తరువాత విడుదల చేస్తామని చెప్పింది. 

2024–25 నాటికి సింగిల్‌ మీడియం స్కూళ్లు
2024–25 నాటికి సింగిల్‌ మీడియం స్కూళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం 2022–23లో 9, 10 తరగతుల్లో మాత్రమే డ్యూయల్‌ మీడియం ఉండాలని పేర్కొంది. 2023–24లో టెన్త్‌లో మాత్రమే డ్యూయల్‌ మీడియం ఉండాలని స్పష్టం చేసింది. ఆయా స్కూళ్లలోని సబ్జెక్టు టీచర్ల స్టాఫ్‌ ప్యాట్రన్‌ను కూడా ఈ సర్క్యులర్లో పొందుపరిచారు.  

Advertisement
 
Advertisement
Advertisement