
అంగలకుదురులో టీడీపీ జెండాలతో ర్యాలీలో సర్పంచ్ అభ్యర్థి రాజ్యలక్షి
తెనాలి : పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్లు విస్మరించారు. ఎన్నికల నియమావళిని, ఎన్నికల కోడ్ను సైతం ఖాతరు చేయలేదు. పార్టీ జెండాలు, కండువాలను ధరించి ఊరేగింపు నిర్వహించారు. గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలం అంగలకుదురులో పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీచేస్తున్న అభ్యర్థి ఊసరపు రాజ్యలక్ష్మి శనివారం నామినేషను దాఖలు చేశారు. ముందుగా అభ్యర్థితో సహా తెలుగుదేశం నేతలు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఆ పార్టీ మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు తదితరుల నాయకత్వంలో ప్రదర్శన చేశారు. ముందుగా ముసుగు వేసి ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి పార్టీ కండువాలు, పార్టీ జెండాలతో ఊరేగింపుగా పంచాయతీ కార్యాలయం వరకూ వెళ్లారు. మైకులు, తీన్మార్ బ్యాండులు హోరెత్తాయి. నామినేషను దాఖలు చేసే సమయంలోనూ పార్టీ కండువాలు ధరించే ఉన్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై అంగలకుదురుకు చెందిన జాస్తి శ్రీనివాసరావు సబ్ కలెక్టర్ మయూర్ అశోక్కు ఫిర్యాదు చేశారు.