సాక్షి, ఢిల్లీ: ఏపీలో రైతులకు 3,500 కోట్ల రూపాయల పంట బీమా క్లెయిమ్ లను ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని లోక్సభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ లోక్సభలో వ్యవసాయ శాఖ పద్దులపై చర్చలో ఆయన మాట్లాడుతూ.. పీఎం కిసాన్ పథకం కింద సహాయాన్ని పదివేల రూపాయలకు పెంచాలన్నారు.
‘‘ఏపీలో వైఎస్సార్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశాం. 54 లక్షల మంది రైతులకు 7,802 కోట్ల రూపాయల బీమాను అందించాం. కానీ, ప్రస్తుత బాబు ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ఎత్తేసింది. 2024 -25 బడ్జెట్లో దీనికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. 2025-26లో 1000 కోట్ల రూపాయలు కేటాయించినా బీమా కంపెనీలకు ఒక రూపాయి కూడా విడుదల చేయలేదు. రైతులకు పంట బీమాను చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది’’ అని వైఎస్ అవినాష్రెడ్డి మండిపడ్డారు.
‘‘2,492 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించకపోవడంతో ఏపీని ఇన్సూరెన్స్ కంపెనీలు బ్లాక్ లిస్టులో పెట్టాయి. దాంతో రాష్ట్రంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో.. రైతులు ప్రీమియం చెల్లించడానికి యాప్ ఓపెన్ కావడం లేదు. ప్రీమియం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. 3,500 కోట్ల రూపాయల పంట బీమా క్లెయిమ్లను ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఏపీ రైతులకు బీమాను చెల్లించేలా చర్యలు తీసుకోవాలి
..ఇరాన్ యుద్ధం వల్ల అరటి, మామిడి, మస్క్ మెలన్, వాటర్ మెలన్ ధరలు ఘోరంగా పడిపోయాయి. రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. పెండింగ్ ఇన్పుట్ బకాయిలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలి. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలి. హార్టికల్చర్ హబ్గా ఉన్న రాయలసీమలో భారీ ఎత్తున అరటి మామిడి మస్క్ మిలన్ వాటర్ మిలన్ పంటలు పండుతున్నాయి. పప్పులపై దిగుమతి సుంకం తొలగించడం వల్ల విదేశాల నుంచి భారీ ఎత్తున పప్పులు దిగుమతి అయ్యాయి. దాని ఫలితంగా దేశీయ పప్పులు పండించే రైతులు గిట్టుబాటు ధర కంటే తక్కువకి అమ్ముకోవాల్సిన పరిస్థితి పడింది.
ఏపీలో 3.7 లక్షల ఎకరాల్లో శనగ పంట పండిస్తున్నారు. పప్పు ధాన్యాలు పండించే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు తీసుకోవడం, పప్పు ధాన్యాలపై దిగుమతి పాలసీని పున:పరిశీలన చేయాలి. ప్రతి గ్రామంలో వ్యవసాయ గిడ్డంగులను ఏర్పాటు చేయాలి. మండల లెవెల్లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. వ్యవసాయంత్రీకరణ కు నిధులు కేటాయించాలి’’ అని వైఎస్ అవినాష్రెడ్డి డిమాండ్ చేశారు.


