
మాన్యం కాజేసి.. పరిహారం నొక్కేసిన టీడీపీ నాయకుడు
వెలుగొండ ఆర్ఆర్ ప్యాకేజీలో కాటమరాజు ఆలయాలు
నిర్వాసితులు కానప్పటికీ బినామీ పేర్లతో నిధులు స్వాహా
టీడీపీ నేత స్వార్థానికి రూ.1.62 కోట్లు నష్టపోయిన స్వామి
దర్యాప్తు జరపాలంటూ స్పెషల్ కలెక్టర్కు ఆలయ పూజారి వినతి
ముంపు భూములు కానప్పటికీ అధికారులతో కుమ్మక్కయ్యారు. దేవుడి సొత్తుకే ఎసరు తెచ్చారు. వచ్చిన సొమ్మును జేబులో వేసుకున్నారు.. కాటమరాజుకే శఠగోపం పెట్టారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో టీడీపీ నాయకుడి అవినీతి ఇది. వేనూతల కాటంరాజు ఆలయ భూములను వెలుగొండ ప్రాజెక్టు ముంపులో ఉన్నట్లు చూపించి బినామీ పేర్లతో రూ.1.60 కోట్లు కాజేశాడు.
పెద్దారవీడు మండలం గుండంచెర్ల గ్రామానికి సమీపంలో కాటంరాజు స్వామి, గంగాభవానీ ఆలయాలు సర్వే నంబర్లు 629, 630లలోని 7.39 ఎకరాల్లో వందల సంవత్సరాల కిందటి నుంచి ఉన్నాయి. ఇవి వెలిగొండ ప్రాజెక్టు మునక ప్రాంతంలో లేకున్నా గుండంచెర్ల గ్రామ టీడీపీ నాయకుడు ముంపు భూముల కింద చూపి ఆర్ఆర్ ప్యాకేజీ పొందారన్న ఆరోపణలున్నాయి. – యర్రగొండపాలెం
మరో 50 ఎకరాలకూ ఎసరు
దేవుడి మాన్యం ఒకవేళ ముంపులో ఉంటే ఆర్ఆర్ చట్టం కింద పరిహారం నిధులు దేవదాయ శాఖకు చెందాల్సి ఉంటుంది. కాగా, టీడీపీ నాయకుడు దేవుని మాన్యం మరో 50 ఎకరాల భూములను కూడా బినామీ పేర్లతో ఆర్ఆర్ ప్యాకేజీలో చేర్చి జేబులు నింపుకొన్నారు. తమ ప్రాంతం వారు కానప్పటికీ అర్థవీడు మండలం మావుటూరు తండాకు చెందిన 13 మంది పేర్లను ప్యాకేజీలో చేర్చి ఒక్కొక్కరికి రూ.12.50 లక్షల ప్రకారం ప్రభుత్వం నుంచి ఇప్పించాడు.
ఈయనతో పాటు మరికొందరు.. ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల ప్రకారం రూ.65 లక్షలు తీసుకున్నారు. వీరిలో జిల్లా భూ సేకరణ, రెవెన్యూ అధికారుల హస్తం ఉందని, ఈ అవినీతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. అక్రమాలపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని స్పెషల్ కలెక్టర్కు కాటంరాజు ఆలయ పూజారి వినతిపత్రం ఇచ్చారు.
స్వామి భూముల రికార్డులు తారుమారు
వేనూతల కాటమరాజు స్వామికి సంబంధించిన భూముల రికార్డులు తారుమారు చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి. సర్వే నంబరు 630లో 2.69 ఎకరాలు, సర్వే నంబర్ 629లో 4.70 ఎకరాలు ఆర్ఎస్ఆర్ రికార్డులో స్వామి పేరు ఉన్నాయి.
2016లో కలనూతల రెవెన్యూ పరిధిలో స్వామి, అమ్మవార్ల భూములను కాటమరాజు తండాకు చెందిన దేశావత్ ఆదెమ్మ, బిలావత్ బుజ్జమ్మల పేరు మీద రెవెన్యూ అధికారులు ఆన్లైన్ చేశారు. మామూళ్లకు ఆశపడి రెవెన్యూ అధికారులు రికార్డులను తారుమారు చేశారు. గత ప్రభుత్వం దేవాలయానికి నిత్యం పూజలు జరిగే విధంగా, ప్రాజెక్టు మునకలో పోకుండా చర్యలు తీసుకుంది. – పాముల రుషికేశవ, ఆలయాల పూజారి
వాస్తవ లబ్ధిదారులకు నష్టపరిహారం చెందాలి
వెలిగొండ ప్రాజెక్ట్ మునక ప్రాంతాల్లో ఉన్న వాస్తవ లబ్ధిదారులకు నష్టపరిహారం చెందేలా చర్యలు తీసుకోవాలి. కాటమరాజు, గంగా భవాని అమ్మవార్ల ఆలయాలతో పాటు భూములను కూడా బినామీ పేర్లతో ఆర్ఆర్ ప్యాకేజీ పొందారు. బినామీల స్థానంలో గుండంచెర్ల గ్రామంలోని ఉన్న 12 మంది చెంచులను అర్హులుగా చేర్చి నష్ట పరిహారం వారికి అందేలా చర్యలు తీసుకోవాలి.
కన్నూతల గ్రామంలో ఉన్న 50 మంది చెంచులకు కూడా సాయం అందించాలి. బినామీ పేర్లతో ప్రభుత్వ నిధులను స్వాహా చేసిన టీడీపీ నాయకులు, రెవెన్యూ, భూ సేకరణ అధికారులపై చర్యలు తీసుకోవాలి. స్పెషల్ కలెక్టర్ కార్యాలయంలో గత నెల 28వ తేదీ అర్జీ ఇచ్చినా చర్యలు తీసుకోలేదు. – గాలి వెంకటరామిరెడ్డి, కార్యదర్శి, వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల సంఘం