విజయవాడ: కూటమి సర్కారుపై కాపు రిజర్వేషన్ పోరాట సమితి మండిపడింది. కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు చలమల్ల ప్రసాదరావు బుధవారం మాట్లాడుతూ.. కాపులను ఎన్నికల్లో కరివేపాకులా వాడుకుని వదిలేస్తున్నారని చెప్పారు. వెంటనే కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు 12% శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
‘‘ప్రభుత్వానికి మూడు నెలలు గడువు ఇస్తున్నాం. బీసీల మాదిరి కాపులకు కాపు రక్షణ చట్టం తీసుకురావాలి. జూలై 27న అన్ని కలెక్టరేట్లలో వినతి పత్రాలు ఇస్తాం. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు రిజర్వేషన్ల ఇస్తామని చెప్పారు. 2014లో అసెంబ్లీలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పై చంద్రబాబు తీర్మానం చేసి నేటికీ అమలు చేయలేదు. 2014, 2024 ఎన్నికల్లో కాపులు పెద్దన్న పాత్ర పోషించారు.
కాపుల పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ చెబితే ఓట్లేశారు. కూటమిని గెలిపిస్తే ఈ రెండేళ్లలో కాపులకు మీరేం చేశారు? కాపు కార్పొరేషన్కు నిధులు ఇవ్వడం లేదు. కాపుల రిజర్వేషన్లను పట్టించుకోవడం లేదు. కాపులను ఎక్కడ చంపుతున్నా పట్టించుకోవడం లేదు. కాపులకు విదేశీ విద్య పథకం లేదు. కాపు భవనాలు కట్టిస్తామన్నారు.. కట్టించలేదు. కొన్ని వేల కోట్ల రూపాయలతో రాజధాని కడుతున్న మీరు కాపులను ఎందుకు తొక్కిపెడుతున్నారు?
కాపుల పట్ల ఎందుకు మీరు ఇంత వివక్ష చూపుతున్నారు? మేం ఎన్నుకున్న.. మేం గెలిపించుకున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మాకు లేదా? కాపులను కరివేపాకులా వాడుకుంటున్నారు. కాపులకు అన్యాయం జరుగుతుంటే పవన్ పట్టించుకోరా? పెద్దన్న పాత్ర పోషించాలని అడిగారు. మరి మా గురించి మీరు అడగరా? వెంటనే ప్రత్యే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి రిజర్వేషన్ల కోటాను పెంచాలి. డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రత్యక్ష పోరాటం చేయకతప్పదు’’ అని చలమల్ల ప్రసాదరావు హెచ్చరించారు.


