జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్
న్యూఢిల్లీ: మంత్రి పదవి రాలేదన్న ఆక్రోశంతో రఘురామ కృష్ణంరాజు మతాల మధ్య గొడవలు పెడుతున్నారని జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని వివాదాస్పద స్థలంలో యథాతథస్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు రఘురామ కృష్ణంరాజుకు చెంపపెట్టు అని అన్నారు. బ్యాంకులను ముంచిన డబ్బులతో ఏం చేయాలో తెలియక మతాల మధ్య తగాదా పెడుతున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి మతాలు, కులాల మధ్య గొడవలు పెట్టడం మానుకోవాలని రఘురామ కృష్ణంరాజుకు హితవు పలికారు.
''తల్లిదండ్రులు పిల్లల పేర్లతో బ్యాంకుల నుంచి రఘురామ కృష్ణంరాజు వేలకోట్ల రూపాయలు దోపిడీ చేశారు. నాలుగు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న రఘురామ కృష్ణంరాజు రామభక్తుడా? సనాతనుడా? నీలాగా ఎవరు బ్యాంకులను దోచుకోవడం లేదు. దళిత క్రైస్తవులపై రఘురామ కృష్ణంరాజు దాడులకు పాల్పడుతున్నారు. దళితులు రామాలయ నిర్మాణానికి వ్యతిరేకమని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఎవరి బతుకు వాళ్ళు బతుకుతుంటే మీకెందుకు కడుపు మంట? మతపరమైన అంశాలను ప్రజల మధ్య చొప్పించి ఎందుకు చిచ్చు పెడుతున్నారు?
రామాలయ నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు. కొన్ని సంవత్సరాలుగా పూజిస్తున్న గొంతేనమ్మ గుడిని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఇంటికో పోలీసును పెట్టి గొంతేనమ్మ గుడిని కూల్చాల్సిన అవసరం ఏముంది? ఒక మతం మీద దాడి చేసి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. స్థానిక ప్రజల మనోభావాలను గౌరవించమని మేము అడుగుతున్నాం. మత స్వేచ్ఛను హరించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు?
అధికారులను ఒత్తిడి చేసి మత రాజకీయాలు చేస్తున్నారు. రఘురామ కృష్ణంరాజు పతనం ఖాయం. 2010లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రభుత్వ భూముల్లో మతపరమైన కట్టడాలు నిర్మించడానికి వీలులేదు. దీని ప్రకారం ప్రభుత్వ స్థలంలో గొంతేనమ్మ గుడి కొనసాగడానికి కూడా ఆస్కారం లేదు. అయితే ఎప్పటి నుంచో ఉన్న గొంతేనమ్మ గుడిని కూల్చేసి రామాలయం కడతామని రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న రఘురామ కృష్ణంరాజు పంతం పట్టడం తీవ్ర అభ్యంతరకరం. దీన్ని మేము సుప్రీంకోర్టులో సవాల్ చేశాం. అక్కడ ఎటువంటి కట్టడాలు కట్టకుండా సర్వోన్నత న్యాయస్థానం స్టేటస్ కో ఇచ్చింది. ఇది ప్రజల విజయమ''ని జడ శ్రవణ్కుమార్ అన్నారు.


