అంతర్జాతీయ స్థాయిలో విశాఖ రైల్వేస్టేషన్‌ అభివృద్ధి  | International level development of Visakha Railway Station | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ స్థాయిలో విశాఖ రైల్వేస్టేషన్‌ అభివృద్ధి 

Oct 1 2023 5:05 AM | Updated on Oct 1 2023 5:05 AM

International level development of Visakha Railway Station - Sakshi

తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని కేంద్ర రైల్వే, జౌళి శాఖల సహాయ మంత్రి దర్శనా జర్దోష్‌ తెలిపారు. వాల్తేర్‌ డివిజన్‌ డీఆర్‌ఎం సౌరబ్‌ ప్రసాద్‌తో కలిసి శనివారం విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ను ఆమె సందర్శించారు. విశాఖ రైల్వేస్టేషన్‌ దేశంలో రద్దీ స్టేషన్‌లలో ఒకటని, నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారని మంత్రి తెలిపారు.

ఈ నేపథ్యంలో దీన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు స్టేషన్‌ రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించారని చెప్పారు. ఈ పనులపై గతిశక్తి, వాల్తేర్‌ డివిజన్‌ అధికారులతో దర్శనా జర్దోష్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. జరుగుతున్న పనుల గురించి అధికారు­లు ఆమెకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చా­రు. తర్వాత ఆమె ఒకటో నంబర్‌ గేట్‌ వైపు ప్రారంభమైన మల్టీ లెవెల్‌ కార్‌ పార్కింగ్‌ను సందర్శించారు.

రైల్వేస్టేషన్, స్టేషన్‌ రీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్లాస్టిక్‌ నిషేధంలో భాగంగా స్టేషన్‌లో విధు­లు నిర్వర్తిస్తున్న పారిశుధ్య కారి్మకులకు హెల్త్‌ కిట్స్‌­ను అందజేశారు. అనంతరం ఏటికొప్పాక బొమ్మలతో వన్‌ స్టేషన్‌–వన్‌ ప్రొడక్ట్‌ పథ­కం కింద ఏర్పాటు చేసిన స్టాల్‌ను పరిశీలించా­రు. అమ్మకాలు, స్టేషన్‌ అధికారుల ప్రోత్సాహం, సహకా­రం గురించి స్టాల్‌ యజమానితో మాట్లాడారు.  

24/7 రైల్‌ కోచ్‌ రెస్టారెంట్‌ ప్రారంభం 
రైల్వేస్టేషన్‌ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన 24/7 రైల్‌ కోచ్‌ రెస్టారెంట్‌ను మంత్రి దర్శనా జర్దోష్‌ ప్రారంభించారు. రైల్వే ప్రయాణికులకు, నగర వాసులకు ఈ రెస్టారెంట్‌ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. వాల్తేర్‌ డివిజన్‌ అధికారుల, సిబ్బంది పనితీరును మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్, వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డీసీఎం త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement