సాక్షి, వైఎస్సార్ జిల్లా: ‘సర్’ ప్రక్రియలో చిత్ర విచిత్రాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఓటు 2002 జాబితాలో గల్లంతయ్యింది. అంజాద్ బాషా కుటుంబ సభ్యుల ఓట్లు కూడా గల్లంతయ్యాయి. అంజాద్ బాషా ఇంటి పక్కన ఉన్న నాలుగు ఇళ్ల ఓట్లు కూడా గల్లంతు కావడంతో జిల్లా కలెక్టర్కు అంజాద్ బాషా ఫిర్యాదు చేశారు.
‘‘నేను పుట్టినప్పటి నుంచి అదే ఇంట్లో ఉంటున్నా.. ఓట్లు ఎలా మాయమవుతాయి?. 2002 ఓటర్ల జాబితాలో అనేక లోటుపాట్లు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఓటు కూడా మిస్ అయ్యింది. వెంటనే జిల్లా కలెక్టర్, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి’’ అని అంజాద్ బాషా డిమాండ్ చేశారు.

శెట్టిపల్లి ఇంటిపేరు ఉన్న అందరికి పేర్లు మాయమయ్యాయి. 2002లో ఎమ్మెల్యేగా చేసిన శెట్టిపల్లి రఘురామిరెడ్డి.. జాబితాలో మాజీ ఎమ్మెల్యే పేరే లేకపోవడంతో అవాక్కవుతున్నారు. నక్కలదిన్నెలో రఘురామిరెడ్డి కొన్నేళ్లుగా ఓటు వేస్తున్నారు. పక్క గ్రామం ఖాదర్పల్లి బూత్లోకి ఓటు మారినట్లు సమాచారం. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోలేదు.


