దళిత యువకుడిని బలిగొన్న టీడీపీ | Dalit youth death form tdp harassment | Sakshi
Sakshi News home page

దళిత యువకుడిని బలిగొన్న టీడీపీ

May 4 2026 6:20 AM | Updated on May 4 2026 6:20 AM

Dalit youth death form tdp harassment

ఐటీడీపీ అధ్యక్షుడి వేధింపులు తాళలేక ఆత్మహత్య 

ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం 

మృతుడి కుటుంబం వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉంటోందని కక్షగట్టి వేధింపులు 

మంత్రి టీజీ అండతోనే తనను వేధించాడని సూసైడ్‌ నోట్‌

కర్నూలు/కర్నూలు (టౌన్‌): ఐటీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌ అనుచరుడి వేధింపులు తాళలేక దళిత యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు శ్రీరామ్‌నగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. నగరానికి చెందిన బీసీ సతీష్‌ (27) ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తనపై అక్రమంగా కేసు పెట్టించి వేధింపులకు గురి చేయడంతో తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నట్టు ఆ యువకుడు సూసైడ్‌ నోట్‌ రాయడం కలకలం రేపింది. ‘నా ప్రేమ వ్యవహారంలో మెయిన్‌ విలన్‌ ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌ అనుచరుడు గట్టు తిలక్‌. 

మంత్రి టీజీ భరత్‌ నన్ను వేధించాడు. టీడీపీ పవర్‌ను ఉపయోగించి నీ జీవితం నాశనం చేస్తా.. నీ కుటుంబాన్ని రోడ్డున పడేలా చేస్తా.. ఎస్సీవైన నీకే అంత ఉంటే.. నాకెంత ఉండాలి’ అని వేధించి బెదిరించాడు. ‘నువ్వు, నీ కుటుంబం ఊరొ­దిలి వెళ్లాలని పోలీసులతో ఒత్తిడి చేయించాడు. చివరకు అమ్మా­యి తండ్రితో నాపై అక్రమంగా కేసు పెట్టించి పోలీసులతో వేధింపులకు గురి చేస్తుండటాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసు­కుంటున్నా’ అని మృతుడు సతీష్‌ సూసైడ్‌ నోట్‌ వివరించాడు. 

ప్రేమ వ్యవహారంలో వేధింపులే కారణం 
కర్నూలు శ్రీరామ్‌నగర్‌లో ఉంటున్న బీసీ బాలన్న, శోభారాణి దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడైన సతీష్‌ మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. కాగా.. అదే కాలనీకి చెందిన ఓ యువతి, సతీష్‌ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సతీష్‌ కుటుంబం చాలాకాలంగా వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉంటోంది. ఎలాగైనా ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో స్థానిక టీడీపీ కార్యకర్తలు సతీష్‌ ప్రేమ వ్యవహారాన్ని బజారుకీడ్చి ఇబ్బంది పెట్టేందుకు కుట్ర పన్నారు. కర్నూలులో మంత్రి టీజీ భరత్‌ వ్యవహారాలు చక్కబెడుతున్న ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్‌ను వారంతా సంప్రదించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రేమ జంటను విడదీసేందుకు ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్‌ కొంతకాలంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు.

 ఐదు రోజుల క్రితం విధి నిర్వహణలో భాగంగా మంత్రి టీజీ భరత్‌కు చెందిన గౌరీగోపాల్‌ హాస్పిటల్‌లో డాక్టర్లను కలవడానికి సతీష్‌ వెళ్లగా.. ఆ ఆస్పత్రి పాలనా వ్యవహారాలు చూస్తున్న గట్టు తిలక్‌ ఇద్దరు కానిస్టేబుళ్లను పిలిపించి అతడిని బెదిరించాలని ఆదేశించాడు. దీంతో అతడి సెల్‌ఫోన్‌ లాక్కున్న కానిస్టేబుళ్లు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి రాత్రి 10 గంటల వరకు కూర్చొబెట్టి వదిలేశారు. ఇంటికి చేరుకున్న సతీష్‌ జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పాడు. పోలీసులు తన సెల్‌ఫోన్‌ను ఇవ్వకపోవడంతో సతీష్‌ తీవ్ర మనస్తాపం చెందాడు.

ఆదివారం రెండు పేజీల సూసైడ్‌ నోట్‌ రాశాడు. తన చావుకు ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్‌ కారణమంటూ కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలన్నిటినీ ఆ లేఖలో వివరించాడు. అనంతరం ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఫ్యాన్‌కు వేలాడుతున్న సతీష్‌ను చూసిన తల్లి వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మూడో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్‌ నోట్‌ను స్వా«దీనం చేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులతో కలసి మార్చురీ వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.  మృతుని తండ్రి బీసీ బాలన్న ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  

గట్టు తిలక్‌పై కేసు నమోదు చేయాలి: ఎస్వీ మోహన్‌ రెడ్డి డిమాండ్‌ 
ప్రేమ వ్యవహరంలో తలదూర్చి కర్నూలులోని శ్రీరామనగర్‌కు చెందిన సతీష్‌ ఆత్మహత్యకు కారకులైన ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్‌పై వెంటనే కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం కర్నూలు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద మృతుడి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సతీష్‌ మర­ణానికి కారణమైన గట్టు తిలక్‌పై చర్యలు తీసుకోవాలని, పోలీసులు నిష్పక్షపాతంగా విచా­రించి కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement