ఏపీలో రేపటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి కోవిడ్‌ టీకా పంపిణీ

Published Fri, Jan 15 2021 3:32 PM

covid vaccination in andhra pradesh begins from tomorrow - Sakshi

విజయవాడ: ఏపీ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రేపటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. వర్చువల్‌ పద్ధతిలో ప్రధాని మోదీ  రేపు ఉదయం 10.30 గంటలకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, ఏపీలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. విజయవాడలోని జీజీహెచ్‌లో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ కాటమనేని‌ భాస్కర్ వెల్లడించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా సాగనుందనే అంశంపై ఆయన మాట్లాడుతూ..

రాష్ట్రవ్యాప్తంగా 332 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, ప్రతి కేంద్రంలో ఆరుగురు సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. సుమారు 2 వేల మంది సిబ్బందిని ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేసినట్లు ఆయన వెల్లడించారు. తొలి విడతలో 3.83 లక్షల మంది వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పని చేసే కేంద్ర ప్రభుత్వ వైద్య సిబ్బందికి అలాగే మంగళగిరి ఎయిమ్స్ వైద్య సిబ్బందికి, విశాఖలోని నేవికి చెందిన వైద్య సిబ్బందికి ఇక్కడే వ్యాక్సినేషన్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రానికి ఇప్పటికే 4.77 లక్షల కోవిషీల్డ్, 20 వేల‌ కోవ్యాక్సిన్ వ్యాక్సిన్లు చేరుకున్నట్లు కాటమనేని‌ భాస్కర్ వెల్లడించారు. వ్యాక్సిన్ రవాణా విషయంలో అలాగే భద్రపరిచే విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోలీస్ బందోబస్తు మధ్య వ్యాక్సిన్ ను 332 కేంద్రాల్లోని కోల్డ్ చెయిన్ పాయింట్లకి చేరవేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement