
సాక్షి, ఏలూరు: ఈ నెల 4న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఏలూరు కార్పొరేషన్ మాజీ మేయర్ నూర్జహాన్ కుమార్తె వివాహ కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నారని వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంటు అధ్యక్షుడు పుప్పాల వాసుబాబు వెల్లడించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అత్యంత పటిష్టంగా భద్రతా చర్యలు చేపడుతున్నారు. సీఎం జగన్ పర్యటన ఖరారు కావడంతో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. తమ్మిలేరు వరద ముంపు నుంచి ఏలూరు నగర ప్రజలకు శాశ్వత పరిష్కారం లభించేలా తమ్మిలేరు వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి తంగెళ్లమూడి వద్ద సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారని ఆయన చెప్పారు.