ఏది వాస్తవం.. ఏది కాదు.. ప్రజలకు తెలియాలి

CM Jagan Comments At AP Fact Check website And Twitter account launch - Sakshi

ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ వెబ్‌సైట్, ట్విటర్‌ అకౌంట్‌ ప్రారంభ కార్యక్రమంలో సీఎం జగన్‌ 

వ్యక్తిగత ఉద్దేశాలతో వ్యవస్థలను భ్రష్టు పట్టించే హక్కు ఎవరికీ లేదు 

ఆలయ ఘటనల్లో టీడీపీ ప్రమేయం నిర్ధారణ.. ఇలాంటి వాటికి ఎక్కడో ఒకచోట ముగింపు పలకాలి 

వ్యవస్థకు మేలు జరిగేలా ఫ్యాక్ట్‌ చెక్‌ పని చేయాలి    

సాక్షి, అమరావతి: వాస్తవం ఏమిటి.. వాస్తవం కానిది ఏమిటనేది ప్రజల్లోకి స్పష్టంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వ్యక్తిగత ఉద్దేశాలతో వ్యవస్థలను భ్రష్టు పట్టించే హక్కు ఎవ్వరికీ లేదని స్పష్టం చేశారు. వ్యవస్థలను తప్పుదోవ పట్టించే పనులు ఎవరూ చేయకూడదన్నారు. మీడియాలో, సోషల్‌ మీడియాలో దురుద్దేశ పూర్వకంగా చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ ‘ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌’ ఏపీ ప్రభుత్వం తరఫున వేదికగా నిలవాలని సూచించారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ వెబ్‌సైట్, ట్విటర్‌ అకౌంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మీడియాలో, సోషల్‌ మీడియాలో కొందరు దురుద్దేశ పూర్వక ప్రచారం చేస్తున్నారని, ఈ తప్పుడు ప్రచారాన్ని ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ వేదికగా ప్రభుత్వం ఆధారాలతో ఖండిస్తుందన్నారు. ‘జరుగుతున్న ప్రచారం ఎలా తప్పో సాక్ష్యాధారాలతో చూపిస్తారు. నిజమేంటో, అబద్ధం ఏంటో చూపిస్తారు. ఇదీ ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ ముఖ్య ఉద్దేశం. దురుద్దేశ పూర్వక ప్రచారంపై అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రచారం తొలుత ఎక్కడి నుంచి మొదలైందో గుర్తించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఒక వ్యక్తి ప్రతిష్టను, ఒక వ్యవస్థ ప్రతిష్టను ఉద్దేశ పూర్వకంగా దెబ్బ తీసే హక్కు ఏ ఒక్కరికీ లేదు. వ్యక్తిగత ఉద్దేశాలతో వ్యవస్థలను భ్రష్టు పట్టించే హక్కు ఎవ్వరికీ లేదు. వ్యవస్థలను తప్పుదోవ పట్టించే పనులు ఎవరూ చేయకూడదు’ అని సీఎం చెప్పారు. 

దురుద్దేశ ప్రచారానికి చెక్‌ పెట్టాలి 
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలపై వ్యవస్థలను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారాలు చేస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వేరే కారణాలతో ఇలాంటి దురుద్దేశ పూర్వక ప్రచారం చేస్తున్నారన్నారు. ఆలయాల్లో ఘటనలకు సంబంధించిన కేసుల్లో టీడీపీ వాళ్ల ప్రమేయాన్ని విచారణలో నిర్ధారించారని, ఇలాంటి వాటికి ఎక్కడో ఒకచోట ముగింపు పలకాలని పేర్కొన్నారు. వాస్తవం ఏమిటి.. వాస్తవం కానిది ఏమిటనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వ్యవస్థకు మేలు జరిగేలా ఫ్యాక్ట్‌ చెక్‌ పని చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్‌) జి.వి.డి కృష్ణమోహన్, సమాచార శాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌ రెడ్డి, డీఐజీ (టెక్నికల్‌ సరీ్వసెస్‌) జి.పాలరాజు, ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top