
నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్లదే
పనితీరు బాగా లేకపోతే పక్కన పెట్టేస్తా
వచ్చే నెల రోజులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేసిన పనుల్ని వివరించాలి
టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, అమరావతి: టీడీపీలోనే వారసత్వం ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. వారసులకు చేయూతనిస్తామని, దాన్ని నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆదివారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పరిశీలకులతో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. వారసులైనా పని చేస్తేనే పదవులు వస్తాయని వివరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరు గురించి చాలా రకాలుగా సర్వేలు చేయిస్తున్నానని పేర్కొన్నారు. ప్రజలు, కార్యకర్తలతో నేతలు ఎలా వ్యవహరిస్తారనేది ముఖ్యమని చెప్పారు.
ఏడాది ముందు ఎన్నికల కోసం పని చేస్తే ప్రజలు నమ్మరని, మొదటి నుంచే పొరపాట్లు సరిదిద్దుకుని, పాలనలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకుందామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలతో సమావేశమవుతానని, తప్పులుంటే చెప్పి సరిచేసుకోవడానికి సమయం ఇస్తానని, మారకపోతే వారినే మార్చేస్తానని హెచ్చరించారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడినట్టు చెప్పారు. తన సొంత నియోజకవర్గంలో ఎవరు తప్పు చేసినా పక్కనపెడతానని చెప్పారు. డబ్బులుంటే గెలుస్తామని భావించవద్దని సూచించారు. వైకుఠపాళి అభివృద్ధి వద్దని, సుస్థిర ప్రభుత్వం ఉండాలని పేర్కొన్నారు. 2004, 2019లో టీడీపీ మళ్లీ గెలిచి ఉంటే రాష్ట్ర రూపురేఖలు మారేవని చెప్పారు.
జూలై 2 నుంచి ఇంటింటికీ కార్యక్రమం
వచ్చే నెల 2 నుంచి అందరూ ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో ఇంటింటి ప్రచారం చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, తల్లికి వందనం ద్వారా 67.27 లక్షల మంది విద్యార్థులకు డబ్బు ఇచ్చామని పేర్కొన్నారు. వచ్చేనెల కేంద్రం పీఎం కిసాన్ ఇస్తుందని, అదే రోజున రాష్ట్రం తరఫున అన్నదాత సుఖీభవ పథకం డబ్బులూ ఇస్తామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. 2029లో గెలుపే తన ప్రణాళికని, ఆ దిశగా పని చేస్తున్నానని చెప్పారు.
ఐటీ కంపెనీల ప్రతినిధులకు సీఎం విందు
ఐటీ కంపెనీల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు ఆదివారం తన నివాసంలో డిన్నర్ ఇచ్చారు. అమరావతిలో ప్రతిపాదిత క్వాంటం వ్యాలీ ఏర్పాటుపై సోమవారం జరగనున్న నేషనల్ వర్క్షాప్లో పాల్గొనేందుకు వీరు విచ్చేశారు. హాజరైన ప్రముఖుల్లో టీసీఎస్ ప్రెసిడెంట్ అండ్ గ్లోబల్ హెడ్ వి.రాజన్న, మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ రాజీవ్ కుమార్, ఏటీ అండ్ టీ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ సిద్ధు, వార్నర్ బ్రదర్స్ ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ హెడ్ మనీష్ వర్మ తదితరులు ఉన్నారు.