YSR Kadapa: రిజిస్ట్రేషన్లపై నిఘా నేత్రం | CCTV Cameras to be Installed in Sub Registrar offices in YSR Kadapa | Sakshi
Sakshi News home page

YSR Kadapa: రిజిస్ట్రేషన్లపై నిఘా నేత్రం

Aug 17 2022 9:22 PM | Updated on Aug 17 2022 9:22 PM

CCTV Cameras to be Installed in Sub Registrar offices in YSR Kadapa - Sakshi

సాక్షి, కడప కోటిరెడ్డిసర్కిల్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత మూడేళ్లుగా అవినీతి రహిత పాలన చేస్తున్నారు. నాడు ప్రతిపక్ష నేతగా చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజలకు నవరత్నాల పథకాల్లో భాగంగా ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. అవినీతికి అడ్డాగా ఉన్న శాఖల్లో ఒకటైన స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌లో భూములు, స్థలాల క్రయ విక్రయదారుల నుంచి అధికారులతోపాటు దస్తావేజు లేఖర్లు వేలల్లో లంచాలు వసూలు చేసి వారి జేబులను ఖాళీ చేసేవారు. దీంతో ఆ శాఖలో అవినీతికి చెక్‌ పెట్టేందుకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆ శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.  

వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలో కెమెరాల ఏర్పాటు 
వైఎస్సార్‌ జిల్లాలో కడప అర్బన్, కడప రూరల్, కడప చిట్స్, సిద్దవటం, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, వేంపల్లె, కమలాపురం, దువ్వూరు, అన్నమయ్య జిల్లాలో చిట్వేలి, పుల్లంపేట, రాజంపేట, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, సుండుపల్లె, మదనపల్లె, పీలేరు, బి.కొత్తకోట, కలికిరి, వాయల్పాడు, తంబళ్లపల్లెలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం 24 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో కార్యాలయాలకు ప్రతిరోజు వచ్చి వెళ్లే వారిని పరిశీలించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అవినీతికి చెక్‌ పెట్టేందుకు అవకాశం ఉంటుంది.  

చదవండి: (ఆర్‌ఎంపీల చేతిలో అస్త్రాలివే.. ఇష్టమొచ్చినట్లు వాడితే అంతే సంగతులు)
వెబ్‌సైట్‌లో దస్తావేజు నమూనా 
స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారంలో క్రయ విక్రయదారులు ఎక్కువగా దస్తావేజుల లేఖర్లను ఆశ్రయించడంతో పదుల సంఖ్యలో దస్తావేజు లేఖర్లు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. వారితోపాటు కొంతమంది రిజిస్ట్రేషన్‌ సిబ్బంది కాకుండా బినామీలు కార్యాలయాలు తెరిచి తమ వారితో నిర్వహిస్తున్నారు. దీంతో దస్తావేజుల తయారీ సమయంలో లేఖర్లు చెప్పిందే వేదంగా అక్కడి వ్యవహారాలు నడిచేవి. క్రయ విక్రయదారులను లేఖర్ల బాధ నుంచి తప్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా నమూనా దస్తావేజులను ఆ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. 

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు 
స్థిరాస్తి, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సమయంలో ప్రజలు లంచాల బారిన పడకుండా వారి సొంత గ్రామాల్లో వార్డుల పరి«ధిలోనే స్థిరాస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించింది. ఇప్పటికే ఈ ప్రక్రియకు సంబంధించి సచివాలయ సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు. 

అవినీతిపై ఫిర్యాదు చేయవచ్చు 
వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి అధికారులు, సిబ్బంది తీరుపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా ఫోన్‌ చేసి సమాచారం అందించవచ్చు. లంచాలపై ఫిర్యాదు చేయాలనుకుంటే 14400 నంబరుకుగానీ, జిల్లా రిజిస్ట్రార్‌కుగానీ నేరుగా సమాచారం అందించవచ్చు. ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. 
– బి.శివరాం, డీఐజీ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ, కడప 

14400 నంబరుతో ఫ్లెక్సీల ఏర్పాటు 
అవినీతికి అడ్డుకట్ట వేసేలా, అలాగే లంచగొండితనంపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం తీసుకు వచ్చిన టోల్‌ ఫ్రీ నంబరు 14400పై ప్రజ లకు అవగాహన కలిగేలా వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలోని 24 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement