ఖాతార్నాక్‌ సమస్యలు | Banks Freezing Accounts Due To Suspicious Transactions Leave Innocent Users In Trouble, More Details Inside | Sakshi
Sakshi News home page

ఖాతార్నాక్‌ సమస్యలు

May 22 2026 5:33 AM | Updated on May 22 2026 10:37 AM

Banks Freezing Accounts Due to Suspicious Transactions

అనుమానాస్పద లావాదేవీలతో ఖాతాలను ఫ్రీజ్‌ చేస్తున్న బ్యాంక్‌లు

బెట్టింగ్, ఆన్‌లైన్‌ ట్రేడింగ్, మనీ  ల్యాండరింగ్‌ నిందితుల వలలో  అమాయకులు

ఖాతా తెరుచుకోవాలంటే ఎఫ్‌ఐఆర్‌  నమోదైన పోలీస్‌స్టేషన్‌కి వెళ్లాల్సిందే

కేసు మూలాలు ఇతర రాష్ట్రాల్లో  ఉండడంతో మరిన్ని వెతలు

ఏటీఎం కేంద్రాల వద్ద నగదు మారి్పడి  సమయంలో మోసాలకు ఆస్కారం

నరసరావుపేటలోని ఓ బిర్యానీ సెంటర్‌కు పది రోజుల క్రితం ఓ వ్యక్తి వచ్చి బిర్యానీ తిన్నాడు. రూ.220 బిల్లు చెల్లించాడు. నాలుగు రోజుల  తరువాత ఆ హోటల్‌ నిర్వాహకుడి బ్యాంక్‌ ఖాతా ఫ్రీజ్‌ అయ్యింది. స్థానిక అరండల్‌పేటలోని బ్యాంక్‌కు వెళ్లి దీనిపై ఆరా తీయగా ఆన్‌లైన్‌ క్రికెట్‌ యాప్‌ వినియోగించే బుకీ ఖాతా నుంచి ఈ లావాదేవీ జరిగిందని అధికారులు తెలిపారు. నిత్యం వందల మంది హోటల్‌కు వచ్చి తిని ఫోన్‌ పే చేస్తుంటారని, వారేం చేస్తారో ఎలా తెలుస్తుందని యజమాని వాపోయారు. తనకు రూ.220 బిర్యానీ నిమిత్తం జమ అయ్యిందని, బుకీతో సంబంధలేదంటూ లెటర్లు మీద లెటర్లు ఇస్తే రెండు నెలల తరువాత ఖాతా అందుబాటులోకి వచ్చింది. ఇలా ఎందరో అమాయకులకు సైబర్‌ నేరాలు, క్రికెట్‌ బుకీలతో సంబంధం లేకపోయినా ఖాతాలు ఫ్రీజ్‌ అవుతున్నాయి.

సాక్షి, నరసరావుపేట: క్రికెట్‌ బెట్టింగ్, సైబర్‌ క్రైం, మనీలాండరింగ్‌ వంటి వాటితో ఏమాత్రం ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం లేకపోయినా కొందరి బ్యాంక్‌ ఖాతాలు ఫ్రీజ్‌ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నోయో తెలియక బ్యాంకులకు వెళ్లిన వారు పిడుగులాంటి వార్త వినాల్సి వస్తోంది. మీ ఖాతాకు క్రికెట్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ వినియోగించే వారి నుంచి నగదు లావాదేవీలు జరిపిన వ్యక్తి నగదు జమ చేశాడని చెబుతున్నారు. మీ ఖాతాలు తిరిగి వినియోగించాలంటే సదరు క్రికెట్‌ బుకీపై కేసు నమోదైన పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఎన్‌ఓసీ తీసుకురావాలని పేర్కొంటున్నారు.

కొన్నిసార్లు కేసులు ఉత్తర భారతదేశంలో నమోదు కావడంతో అక్కడికి వెళ్లలేక ఖాతాలను అలానే వదిలేసిన సందర్భాలు లేకపోలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు బ్యాంక్‌ సిబ్బంది మామూళ్లు తీసుకొని ఫ్రీజ్‌ అయిన ఖాతాలను తెరిపించే దందాను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. బ్యాంక్‌ ఖాతాలు ఫ్రీజ్‌ అవుతున్న సమస్యలు ముఖ్యంగా వ్యాపారాలు, అపరిచిత వ్యక్తులతో లావాదేవీలు చేసే వారే ఉంటున్నారు. దీంతో చిన్న వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్న వారి ఖాతాలు నెలల కొద్దీ ప్రీజ్‌ అయ్యి కుటుంబం గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఏటీఎం కేంద్రాల వద్ద...
బ్యాంక్‌ ఖాతాలు ఫ్రీజ్‌ అవుతున్న వినియోగదారులలో ఆన్‌లైన్‌ లావాదేవీల తరువాత ఎక్కువ మంది ఏటీఎం కేంద్రాల వద్ద మోసపోతున్నారు. నగదు జమ కోసం వచ్చిన వారితో కొందరు క్రికెట్‌ బుకింగ్‌ ఏజెంట్లు మాట కలుపుతున్నారు. బంగారం కొంటున్నామని, దుకాణదారుడు నగదు రూపంలో అడుగుతున్నారని, క్యాష్‌ ఇస్తే చెప్పిన ఖాతాలో తమ మిత్రుడు నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా నగదు జమ చేస్తారని చెబుతున్నారు. సులభంగా పని అవుతుండటంతో కొందరు సరేనని చెప్పి తమ వద్ద తెచ్చుకున్న నగదును క్రికెట్‌ బుకీలకు ఇస్తున్నారు.

నగదు ఆన్‌లైన్‌లో జమ చేయించుకుంటున్నారు. అయితే సదరు క్రికెట్‌ బుకీలు ఎప్పుడైనా పోలీసులకు పట్టుబడితే వారి ఖాతాలను పరిశీలించినప్పుడు వారితో ఏమాత్రం సంబంధం లేని నగదు అందజేసిన వ్యక్తి ఖాతాలు కూడా ఫ్రీజ్‌ అవుతున్నాయి. అదే విధంగా కొందరు నగదు ఉపసంహరణ సమయంలో సైతం తాము క్యాష్‌ ఇస్తామని.. తమ మిత్రుడి ఖాతాకు ఫోన్‌ పే చేయాలని చెబుతున్నారు.

వెయిటింగ్‌ లేకుండా వెంటనే నగదు మార్పిడి అవుతుందన్న ఉద్దేశంతో కొందరు అపరిచిత వ్యక్తులతో లావాదేవీలు చేయడం ఏమాత్రం సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరు నగదు ఇస్తున్నారు, ఎవరికి పంపుతున్నామో తెలియని వాటికి దూరంగా ఉండాలన్నారు. క్రికెట్‌ బుకీలు, సైబర్‌ క్రైం, ఇతర ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడే వ్యక్తుల ఖాతాలైతే సామాన్యులకు కూడా ఇబ్బందులు తప్పవు.

ఎఫ్‌ఐఆర్‌ నమోదైన చోటకు వెళ్లాల్సిందే...
అపరిచిత వ్యక్తులతో నగదు మార్పిడి వల్ల ఖాతాలు ఫ్రీజ్‌ అవ్వడంతోపాటు ఖాతాను తిరిగి యాక్టివేట్‌ చేయించుకోవడానికి ఎక్కడ ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే ఆ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొన్ని ఖాతాలు ఉత్తరభారత దేశంలో ఉండటంతో అక్కడికి వెళ్లలేక కొత్త ఖాతాలు తెరిచిన సందర్భాలు లేకపోలేదు. సైబర్‌ మోసాల్లో నగదు కోల్పోయిన వారి కంటే ఖాతాలు స్తంభించిన వారి బాధలు వర్ణనాతీతం. ఫ్రీజ్‌ చేసిన ఖాతాలను తామేమీ చేయలేమని బ్యాంక్‌ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. కేసు నమోదైన చోటుకు వెళ్లి నో అబ్జక్షన్‌ సర్టీఫికెట్‌ (ఎన్‌ఓసీ) తెస్తేనే ఖాతాను పునరుద్ధరించగలమని చెబుతున్నారు. ప్రజలు ఈ విషయాలను గమనించి జాగ్రత్త పడటమే సులువైన మార్గమని అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement