వైఎస్ఆర్ జిల్లా: కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడిని సైతం రాజకీయాలోకి లాగుతూ కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందని అన్నారు. బ్రహ్మంగారి మఠం మండలం బోడపాడు గ్రామంలో మంగళవారం అవినాశ్ రెడ్డి మాట్లాడారు.
‘‘బోడపాడు గ్రామంలో గత వారం రోజులుగా ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుగుతుంటే కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుంది. పోలీసులను అడ్డం పెట్టుకొని గ్రామంలోని వైసీపీ నాయకులను వారం రోజులుగా స్టేషన్ చుట్టూ తిప్పు కుంటున్నారు. దేవుడితో పెట్టుకుంటే నాశనం అవుతారని కూటమి నాయకులు గ్రహించాలి.
చివరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న వాటిని కూడా పోలీసులు అడ్డుకోవడం దారుణం. రాబోయే రోజులో వివాహాలు చేసుకోవాలన్నా కూటమి నాయకుల అనుమతి తీసుకోవాలేమో అని ప్రజలు అనుమానిస్తున్నారు. గ్రామంలో వైసీపీ నాయకులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని అడ్డుకుంటున్నారు.
కూటమి ప్రభుత్వంలో ఇంత అన్యాయమా అంటూ ప్రజలు ఛీ కొడుతున్నారు. దేవుడిని సైతం రాజకీయాల్లోకి లాగడం బాధాకరం. భవిష్యత్తులో ప్రతిదానికి కూటమి నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది’’ అని అవినాశ్ రెడ్డి చెప్పారు.


