ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల

AP EAPCET Results Released in Andhra Pradesh - Sakshi

మొత్తం 3,00,111 దరఖాస్తులు.. 2,82,496 మంది పరీక్షకు హాజరు

అర్హత సాధించినవారు 2,56,983 మంది

ఇంజనీరింగ్‌లో 1,73,572 మంది, అగ్రికల్చర్‌లో 83,411 మంది క్వాలిఫై

ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ రద్దు చేసిన ప్రభుత్వం

ఇంజనీరింగ్‌ విభాగంలో బోయ హరేన్‌ సాత్విక్‌కు మొదటి ర్యాంకు

అగ్రికల్చర్‌ విభాగంలో వజ్రాల దినేష్‌ కార్తీక్‌ రెడ్డికి ఫస్ట్‌ ర్యాంకు

ఐఐటీలు, ఎన్‌ఐటీల కౌన్సెలింగ్‌ తర్వాతే ఏపీ ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్, ఫార్మసీ తదితర కోర్సులకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్‌–2022 ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం విజయవాడలో విడుదల చేశారు. ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో మొత్తం 3,00,111 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,82,496 మంది పరీక్ష రాశారు. వీరిలో 2,56,983 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్‌ విభాగంలో 1,94,752 మంది పరీక్ష రాయగా 1,73,572 మంది (89.12 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే అగ్రికల్చర్‌ విభాగంలో 87,744 మంది పరీక్ష రాయగా 83,411 (95.06 శాతం) మంది అర్హత సాధించారు.

ఏపీ ఈఏపీసెట్‌లో ఇంజనీరింగ్‌ విభాగానికి బాలురు అధిక ప్రాధాన్యం ఇవ్వగా, అగ్రికల్చర్‌ విభాగానికి బాలికలు మొగ్గు చూపారు. అటు ఇంజనీరింగ్‌ విభాగంలో, ఇటు అగ్రికల్చర్‌ విభాగం రెండింటిలోనూ అబ్బాయిలే టాపర్లుగా నిలిచారు. ఇంజనీరింగ్‌ విభాగంలో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన హరేన్‌ సాత్విక్‌ మొదటి ర్యాంక్‌ (158.6248 మార్కులు) సాధించి సత్తా చాటాడు. అగ్రికల్చర్‌ విభాగంలో గుంటూరు జిల్లాకు చెందిన వజ్రాల దినేష్‌ కార్తీక్‌ రెడ్డి మొదటి ర్యాంకు దక్కించుకున్నాడు. 

దుమ్ములేపేసిన అబ్బాయిలు..
ఏపీ ఈఏపీసెట్‌–2022 ఫలితాల్లో బాలురే టాపర్లుగా నిలిచారు. ఇంజనీరింగ్‌ విభాగంలో మొత్తం టాప్‌–10 ర్యాంకులు అబ్బాయిలకే దక్కాయి. వీరిలో నలుగురు తెలంగాణకు చెందిన విద్యార్థులు 5, 6, 7, 9 ర్యాంకులను సొంతం చేసుకున్నారు. అగ్రికల్చర్‌ విభాగంలో రెండు ర్యాంకులు మినహా మిగిలిన 8 ర్యాంకులు బాలురకే దక్కాయి. వీటిలో 7, 8, 9 ర్యాంకులు తెలంగాణ విద్యార్థులకు లభించాయి. ర్యాంకర్ల వివరాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పరీక్షల అనంతరం తుది ‘కీ’ని ప్రకటించామని గుర్తు చేశారు.

అభ్యంతరాలను స్వీకరించాక కేవలం పది రోజుల్లోనే ఫలితాలను వెల్లడించామని తెలిపారు. గతేడాది కంటే ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షలు రాయడంతోపాటు అత్యధికులు అర్హత సాధించారని చెప్పారు. పరీక్షలో 160 మార్కులకు గాను 25 శాతం సాధించినవారిని అర్హులుగా పరిగణించామని వివరించారు. ఇంటర్మీడియెట్‌లో సాధించిన మార్కులకు ఈ ఏడాది వెయిటేజీ రద్దు చేశామన్నారు. కౌన్సెలింగ్‌కు ఏపీ ఈఏపీసెట్‌లో వచ్చిన ర్యాంకునే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈసారి పరీక్షకు హాజరైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అందరినీ అర్హులుగా పరిగణిస్తామన్నారు. ఫార్మసీ విభాగంలో 16,700 సీట్లు, ఇంజనీరింగ్‌లో 1,48,283 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఈసారి కోర్సుల డిమాండ్‌ను బట్టి ఆయా విభాగాల్లో సీట్లను పెంచే ఆలోచన ఉందన్నారు.

ఐఐటీలు, ఎన్‌ఐటీల కౌన్సెలింగ్‌ తర్వాతే చేరికలు..
రాష్ట్రంలో ఎక్కువమంది విద్యార్థులు ఐఐటీలు, ఎన్‌ఐటీలను ఎంచుకుంటున్నందున వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటిలో ప్రవేశాలు పూర్తయ్యాకే ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ చేపడతామని మంత్రి బొత్స తెలిపారు. కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేసే 70 శాతం సీట్లకు జగనన్న విద్యా దీవెన అందిస్తామని చెప్పారు. యాజమాన్య కోటాపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కాగా పరీక్షలను సమర్థంగా నిర్వహించిన అనంతపురం జేఎన్‌టీయూ వైస్‌ చాన్సలర్, సెట్‌ కన్వీనర్‌ను మంత్రి బొత్స, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి అభినందించారు. 

టాపర్ల మనోగతాలు..
ఐఐటీ బాంబే నా లక్ష్యం.. 
మాది.. హిందూపురం. అమ్మ పద్మజ బయాలజీ టీచర్‌గా, నాన్న లోక్‌నాథ్‌ హైస్కూల్‌లో ఫిజికల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. నేను బెంగళూరులో ఇంటర్‌ చదివాను. ఇటీవల జేఈఈ మెయిన్‌లోనూ మంచి ర్యాంకు వచ్చింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఎంసెట్‌లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించగలిగాను. ఆగస్టు 28న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కోసం సిద్ధమవుతున్నాను. అందులో సీటు సాధించి ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ చదువుతా.
– బోయ హరేన్‌ సాత్విక్, ఫస్ట్‌ ర్యాంకర్, (ఏపీ ఈఏపీసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగం)

కంప్యూటర్‌ ఇంజనీర్‌ అవుతా..
మాది ఒంగోలు. అమ్మానాన్న లక్ష్మీకాంత, మాల్యాద్రిరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నేను గుడివాడలో 6 నుంచి 10వ తరగతి వరకు చదివాను. ఇంటర్మీడియెట్‌ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు కాలేజీలో అభ్యసించాను. అన్నయ్య లోకేష్‌రెడ్డి గతేడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకు సాధించాడు. అన్నయ్యలానే నేను కూడా ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ చదువుతాను. మంచి కంప్యూటర్‌ ఇంజనీర్‌ కావడమే నా లక్ష్యం. 
– పోలు లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డి, రెండో ర్యాంకర్‌ (ఏపీ ఈఏపీసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగం)

జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నా..
మాది శ్రీకాకుళం. అమ్మానాన్న మెండ రవిశంకర్, స్వరాజ్యలక్ష్మి ఇద్దరూ ప్రభుత్వ టీచర్లే. అన్నయ్య జయదీప్‌ ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. జేఈఈ మెయిన్‌లో 99.96 పర్సంటైల్‌ స్కోర్‌ చేశాను. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కోసం సన్నద్ధమవుతున్నాను. ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలన్నదే నా లక్ష్యం. తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ని అవుతా.
– మెండా హిమవంశీ, మూడో ర్యాంకర్‌ (ఏపీ ఈఏపీసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగం) 

ఎయిమ్స్‌ లేదా జిప్‌మర్‌లో ఎంబీబీఎస్‌ చేయడమే నా లక్ష్యం
మాది.. గుంటూరు జిల్లా పెదకూరపాడు. నాన్న శ్రీనివాసరెడ్డి ఆర్‌డబ్ల్యూఎస్‌లో వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ శివకుమారి గృహిణి. అన్నయ్య చంద్రశేఖరరెడ్డి విలేజ్‌ సర్వేయర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఎంసెట్‌ కోసం తరగతి గదిలో అధ్యాపకులు చెప్పినదాన్ని అవగతం చేసుకుని సొంతంగా నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకుని.. ముఖ్యమైన పాఠ్యాంశాలను చదివాను. నీట్‌ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాను. ఎయిమ్స్‌ లేదా జిప్‌మర్‌లో ఎంబీబీఎస్‌ చేయడమే నా లక్ష్యం. 
– వజ్రాల దినేష్‌ కార్తీక్‌రెడ్డి, ఫస్ట్‌ ర్యాంకర్‌ (ఏపీ ఈఏపీసెట్‌ అగ్రికల్చర్‌ విభాగం) 

న్యూరాలజీ చేస్తా..
మాది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం. అమ్మ అంబిక.. డిగ్రీ కాలేజీ లెక్చరర్‌గా, నాన్న.. పరాత్పరరావు వైఎస్సార్‌ ఉద్యాన యూనివర్సిటీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అన్నయ్య ఎయిమ్స్‌ రాయ్‌పూర్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. ఎంసెట్‌లో విజయం సాధించడం వెనుక కుటుంబ సభ్యులు, ఫ్యాకల్టీ ప్రోత్సాహం ఎంతో ఉంది. డాక్టర్‌ కావాలనేది నా లక్ష్యం. అందులో న్యూరాలజీ స్పెషలైజేషన్‌ చేస్తా.
–  మట్టా దుర్గ సాయి కీర్తితేజ, రెండో ర్యాంకర్‌ (ఏపీ ఈఏపీసెట్‌ అగ్రికల్చర్‌ విభాగం) 

రోజుకు 12 గంటలు చదివా..
మాది.. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ. అక్క ఆసు సత్య ఎయిమ్స్‌ మంగళగిరిలో ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతోంది. నేను గుంటూరులో ఇంటర్‌ చదివాను. ఎంసెట్‌లో ర్యాంకు కోసం అధ్యాపకులు చెప్పిన విషయాలతోపాటు స్నేహితులతోనూ చర్చించాను. అక్క సత్య సలహాలు కూడా తీసుకున్నాను. రోజుకు 12 గంటలకు పైగా చదివాను. నీట్‌లో కూడా మంచి ర్యాంకు సాధిస్తాననే నమ్మకం ఉంది. ఎంబీబీఎస్‌ పూర్తి చేసి కార్డియాలజీ స్పెషలైజేషన్‌ చేయాలన్నదే నా లక్ష్యం. 
–ఆసు హిందు, మూడో ర్యాంకర్, (ఏపీ ఈఏపీసెట్‌ అగ్రికల్చర్‌ విభాగం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top