ఏపీ: నేడు ఒకేరోజు 8 లక్షల మందికి వ్యాక్సిన్‌

AP To Administer 8 Lakh Vaccines Today - Sakshi

నేడు ఒకేరోజు 8 లక్షల మందికి వ్యాక్సిన్‌.. గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకే స్థాయిల్లో ఏర్పాట్లు

ఇప్పటికే అర్హులకు సమాచారం; ఆధార్‌తో వెళ్లినవారికి కూడా

45 ఏళ్లు దాటిన వారికి 1, 2 డోసుల్లో ఏదైనా.. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు ప్రాధాన్యం

కోవిడ్‌ కట్టడికి గ్రామాల్లో చురుగ్గా ఫీవర్‌ సర్వే.. సీఎం ఆదేశాలతో ఇప్పటికి 13 సార్లు ఇంటింటి సర్వే

లక్షణాలున్న వారికి పరీక్షలు... బాధితులకు చికిత్స

వ్యాక్సిన్ల లభ్యతను బట్టి ఎప్పటికప్పుడు స్పెషల్‌ డ్రైవ్‌లు

టి3 ప్లస్‌ వి ఫార్ములాను ఫాలో అవుతున్న రాష్ట్రం

గతంలో ఒకేరోజు 6.28 లక్షల మందికి టీకా వేసిన ఏపీ  

సాక్షి, అమరావతి: కరోనా విజృంభించిన వేళ ఆక్సిజన్‌ నిల్వలను, ఆసుపత్రుల్లో బెడ్స్‌ను పెంచటంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం... ఇపుడు కేసులు తగ్గుతుండటంతో ఒకవైపు కట్టడి చేస్తూనే వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టింది. వ్యాక్సిన్ల లభ్యతను బట్టి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో ఆదివారం ఒకేరోజు ఏకంగా 8 లక్షల మందికి టీకాలు వేయాలని సంకల్పించి... అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తిచేసింది. మరోవంక గ్రామాల్లో ఫీవర్‌ సర్వేను నిరంతరం కొనసాగిస్తూ... లక్షణాలున్న వారిని గుర్తించి, పరీక్షించి ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చికిత్స చేసే (టీటీటీ) వ్యవస్థను కూడా పకడ్బందీగా కొనసాగిస్తోంది. కోవిడ్‌ కట్టడికి ఈ టీటీటీ ప్లస్‌ వ్యాక్సినేషనే శరణ్యమంటూ శనివారం కూడా రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసిన నేపథ్యంలో... కొన్నాళ్లుగా సీఎం జగన్‌ సారథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. 

గతంలోనూ ఒకేరోజున 6.28 లక్షల టీకాలు... 
ప్రభుత్వమే వ్యాక్సిన్‌ బాధ్యతను నిర్వర్తించాలన్న ఫార్ములాతో ముందుకెళుతున్న ఏపీ ప్రభుత్వం... ఏ రాష్ట్రమూ వేయని విధంగా ఏప్రిల్‌లో ఒకేరోజున 6.28 లక్షల మందికి టీకా వేసి తన సామర్థ్యాన్ని చాటి చెప్పింది. ఇపుడు ఆదివారం నాడు ఒకే రోజున 8 లక్షల మందికి టీకా వేసి... టీకాల లభ్యత పెరిగితే ఎంత వేగంగా దాన్ని పూర్తిచేయగలమనేది మరోసారి చెప్పడానికి సిద్ధమయింది. ఈ మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ కోసం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లూ ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని జిల్లాలకు కలిపి 14 లక్షల డోసుల టీకా చేరింది. ఈ డ్రైవ్‌లో ప్రధానంగా ఐదేళ్ల లోపు చిన్నారులున్న తల్లులందరికీ టీకా వేసేలా చర్యలు తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రాల్లో కూడా వ్యాక్సిన్‌ సెంటర్లను ఏర్పాటు చేసుకునేలా కలెక్టర్లను ఆదేశించారు.

సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసుకున్న వారితో పాటు ఆధార్‌ కార్డు తీసుకెళ్లిన వారికి సైతం వ్యాక్సిన్‌ వేస్తారు. తల్లుల తర్వాత 45 ఏళ్లు దాటిన వారికి ప్రాధాన్యమిస్తారు. అర్హులందరికీ ఇప్పటికే సచివాలయాల వారీగా సమాచారమిచ్చారు. సమాచారం అందకపోయినా.. ఆధార్‌ కార్డు తీసుకెళ్లిన అర్హులక్కూడా టీకా వేస్తారు. వ్యాక్సిన్‌ డ్రైవ్‌లో 19 వేల మంది ఏఎన్‌ఎంలు, 40 వేల మంది ఆశా కార్యకర్తలు పాల్గొంటారు. ఆదివారం జరిగే టీకా కార్యక్రమంలో మొదటి డోసు, రెండో డోసు వేస్తారు. ప్రతి జిల్లానూ సీనియర్‌ అధికారులు పర్యవేక్షిస్తుండగా ప్రకాశం జిల్లాకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెళుతున్నట్టు తెలియవచ్చింది. 

మొదటి నుంచీ టి3 వ్యూహం... 
కోవిడ్‌ను నిరోధించేందుకు వ్యాక్సిన్లు వేస్తూనే... మరోవంక వైరస్‌ బారిన పడిన వారిని తక్షణం గుర్తించడానికి (ట్రేసింగ్‌) ఫీవర్‌ సర్వేను ప్రభుత్వం నిరంతరం నిర్వహిస్తోంది. అందుబాటులో ఉన్న వలంటీర్‌ వ్యవస్థను అద్భుతంగా ఉపయోగిస్తూ మొదటివేవ్‌లో ఇంటింటి సర్వేకు ఆదేశించిన ముఖ్యమంత్రి జగన్‌... దాన్ని సెకండ్‌వేవ్‌లోనూ కొనసాగిస్తున్నారు. సర్వేలో లక్షణాలు బయటపడ్డవారికి, కావాలని వచ్చినవారికి దాదాపుగా రోజుకు లక్షకు పైగా ప్రభుత్వం టెస్టులు నిర్వహిస్తోంది. ఈ టీ3 వ్యూహంతో పాజిటివ్‌ బాధితులకు కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ లేదా, గ్రామ స్థాయిలోనే ఐసొలేషన్‌ ఏర్పాట్లు చేసి వ్యాప్తికి గ్రామస్థాయిలోనే  అడ్డుకట్ట వేస్తున్నారు. పాజిటీవ్‌ బాధితులకు ప్రభుత్వాసుపత్రులతో పాటు అర్హులయితే ప్రయివేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స (ట్రీట్‌మెంట్‌) అందిస్తోంది. కోవిడ్‌ బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటే. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న వారిలో 90 శాతం మందికి పైగా ఆరోగ్యశ్రీలోనే చికిత్స తీసుకోవటం గమనార్హం. మొదటి వేవ్‌ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 5 సార్లు ఫీవర్‌ సర్వే నిర్వహిస్తే, రెండో వేవ్‌ సమయంలో 8 సార్లు రాష్ట్రంలో ఇంటింటి సర్వే నిర్వహించారు.  

సచివాలయ స్థాయిలో ఫీవర్‌ క్లీనిక్స్‌ 
సచివాలయ స్థాయిలో ఏర్పాటైన ఫీవర్‌ క్లీనిక్స్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 40వేల మంది ఆశా వర్కర్లు, 19వేల మంది ఎఎన్‌ఎంలు, దాదాపు 2.66 లక్షల మంది వాలంటీర్లు ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నారు. ఆయా సచివాలయాల పరిధిలో ముందుగా ఆశావర్కర్లు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి కుటుంబాల్లోని సభ్యుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. సర్వేలో జ్వరంతో పాటు ఇతర కోవిడ్‌ అనుమానిత లక్షణాలుంటే తక్షణం సచివాలయ పరిధిలోని ఎఎన్‌ఎం, మెడికల్‌ ఆఫీసర్‌లకు సమాచారం ఇవ్వగా, వెంటనే ఎఎన్‌ఎం, మెడికల్‌ ఆఫీసర్‌ సదరు ఇంటిని సందర్శించి, అక్కడికక్కడే వారికి కోవిడ్‌ నిర్ధారిత పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,63,62,671 నివాసాలు ఉండగా వాటిల్లో కరోనా రెండో వేవ్‌లో 1,50,13,669 ఇళ్ళలో ఫీవర్‌ సర్వే జరిగింది. మొత్తం 92,364 మంది వైరస్‌ లక్షణాలు ఉన్న అనుమానితులను గుర్తించారు. వారిలో 88,657 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, 10,729 మంది పాజిటీవ్‌ పేషంట్లను గుర్తించారు. 
 
     
 
8 లక్షల నుంచి 10 లక్షల డోసులు 
నేడు మెగా డ్రైవ్‌ చేపడుతున్నాం. అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 8 లక్షల నుంచి 10 లక్షల మంది వరకూ వ్యాక్సిన్‌ వేయాలనేది లక్ష్యం. వ్యాక్సిన్‌ జిల్లాలకు చేరింది. జిల్లా స్థాయిలో కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. పీహెచ్‌సీ స్థాయిలో మెడికల్‌ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారు. 
–కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top