పథకాలు అందని అర్హులకు నగదు జమ చేసిన సీఎం జగన్‌

Andhra Pradesh Govt Deposits Rs 703 Crore To Beneficiaries - Sakshi

Live Updates:
సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి మిగిలిపోయిన వారికి మంగళవారం ఆయన నగదు జమ చేశారు. కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి 9,30,809 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.703 కోట్లు జమ చేశారు.

Time:11:06 AM
గతంలో సంక్షేమ పథకాలకు ఎదురు చూసే పరిస్థితి ఉండేదని.. నేడు ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. నేడు అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి మిగిలిపోయిన వారికి నగదు జమ చేస్తున్నామన్నారు. 9,30,809 మంది ఖాతాల్లో రూ.703 కోట్లు జమ చేస్తున్నామని పేర్కొన్నారు.

Time:10:50 AM
ఇచ్చిన ప్రతీ మాట సీఎం జగన్‌ నిలబెట్టుకుంటున్నారు: పెద్దిరెడ్డి
ఇచ్చిన ప్రతీ మాట ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకుంటున్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.ఇంటింటికీ నవరత్నాలు అందిస్తున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

సాక్షి, అమరావతి: ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ పథకాలకు సంబంధించి, అర్హత ఉన్నప్పటికీ సాయం పొందలేకపోయిన 9,30,809 మంది లబ్ధిదారులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రూ.703 కోట్లను జమ చేయనున్నారు. ఇంతే కాకుండా 3,44,497 మందికి పెన్షన్‌ కార్డులు, 3,07,599 మందికి బియ్యం కార్డులు, 1,10,880 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 90 రోజుల్లో ఇళ్లపట్టాల లబ్ధిదారులతో కలిపి మొత్తంగా 18,47,996 మందికి ప్రయోజనం కల్పించనున్నారు.

మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు జమ చేయనున్నారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరోసారి వెరిఫికేషన్‌ చేసి.. ఏటా జూన్, డిసెంబర్‌లలో సంక్షేమ పథకాల లబ్ధి అందజేస్తామని సీఎం జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో సాధ్యమైనంత మందికి పథకాల లబ్ధిని ఎలా ఎగ్గొట్టాలా అనే ఆరాటమే కనిపించేది. ఇప్పుడు అర్హులైన ఏ ఒక్కరూ పథకాల లబ్ధికి దూరం కాకూడదనే సంకల్పంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. 

అర్హులై ఉండి, ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారు.. సంక్షేమ పథకం అందించిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తులు పరిశీలించి, అర్హులైన వారికి డిసెంబర్‌ నుండి మే వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి జూన్‌లో లబ్ధి కల్పిస్తారు. జూన్‌ నుండి నవంబర్‌ వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి డిసెంబర్‌లో లబ్ధి కల్పిస్తారు.   

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత పారదర్శకంగా సోషల్‌ ఆడిట్‌ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాను ప్రదర్శించి, నూటికి నూరు శాతం సంతృప్త స్ధాయిలో అర్హులకు లబ్ధి కల్పిస్తోంది.
 
 వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ (మహిళలు), వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు రబీ (2019–20), ఖరీఫ్‌ (2020), వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ (రెండవ విడత), జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్సార్‌ వాహన మిత్ర, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా, వైఎస్సార్‌ నేతన్న నేస్తం, పెన్షన్‌ కార్డులు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాల పథకాల కింద నేడు లబ్ధి పొందనున్న వారి సంఖ్య 18,47,996.
  
గత ప్రభుత్వ తీరు ఇలా  

   అస్మదీయులకు మాత్రమే సంక్షేమ ఫలాలు. అర్హులకు ఎలా ఎగ్గొట్టాలనే ఆలోచనలు. సంక్షేమానికి ఎలా కోత పెట్టాలా అనేపరిస్థితి. 

 తమ వర్గం, తమ పార్టీ, తమ వారికే లబ్ధినందించే పక్షపాత జన్మభూమి కమిటీలు. 

సంక్షేమ పథకాల లబ్ధి కోసం ఆత్మాభిమానాన్ని చంపుకుని వృద్ధులు, దివ్యాంగులు, అక్కచెల్లెమ్మలు కాళ్లరిగేలా జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి మోకరిల్లాల్సిన దీనస్థితి. అయినా తప్పని లంచాలు, వివక్ష. 

    గ్రామానికి ఇంత మందికే లబ్ధి అనే కోటాలు. 

 లబ్ధిదారుల ఎంపికలో కాలయాపన, ఎంత లబ్ధి కల్పిస్తారో.. ఎప్పుడు అందజేస్తారో తెలియని అనిశ్చితి. 

 పథకాల సొమ్మును లబ్ధిదారుల ఇతర రుణాలకు జమ చేసుకునే దుస్థితి.  

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇలా.. 

కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా.. అవినీతి, వివక్ష, ఆశ్రిత పక్షపాతానికి తావు లేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు. 

అర్హులై ఉండి ఒకవేళ ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల లబ్ధి అందని వారికి మరో అవకాశమిస్తూ ప్రతి ఏటా రెండు సార్లు లబ్ధి కల్పిస్తున్నారు. 

సంక్షేమ పథకాల లబ్ధి కోసం మధ్యదళారీలు, పైరవీకారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాల ప్రదర్శన. సోషల్‌ ఆడిట్‌ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక. 

దళారులకు, పైరవీకారులకు తావులేకుండా, ఇతర లోన్ల బకాయిలకు బ్యాంకర్లు మళ్లించుకోలేని విధంగా పథకాల సొమ్ము నేరుగా లబ్ధిదారుల అన్‌ ఎన్‌కంబర్డ్‌ ఖాతాలకు జమ. 

సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి, నిర్దిష్ట సమయంలోనే ఠంచన్‌గా లబ్ధి పంపిణీ. 

ఆత్మాభిమానం నిలబడేలా వలంటీర్, సచివాలయ సిబ్బంది సేవలు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top