రాష్ట్రంలో 4.88 కోట్ల డోసుల టీకా పూర్తి | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో 4.88 కోట్ల డోసుల టీకా పూర్తి

Published Fri, Oct 22 2021 3:20 AM

Above 4 crore doses of Covid vaccine completed - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ దూసుకెళ్తోంది. 18 ఏళ్ల వయసు పైబడినవారిలో 50 శాతం మందికి పైగా వ్యాక్సినేషన్‌ పూర్తయింది. గురువారం సాయంత్రానికి రాష్ట్రంలో 4,88,70,313 డోసులు వేశారు. ఇందులో మొదటి డోసు వేయించుకున్నవారు 3,11,81,733 మంది. కాగా, రెండు డోసులు వేయించుకున్నవారు 1,76,88,580 మంది ఉన్నారు. గురువారం ఒక్కరోజే 3.50 లక్షల మందికి టీకా వేశారు. 3–4 రోజుల్లో 5 కోట్ల డోసుల టీకా మార్కును దాటే అవకాశం ఉంది.

మొదటి డోసు వేయించుకున్నవారు తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 34,69,498 మంది ఉన్నారు. రెండు డోసులు వేయించుకున్నవారు కూడా ఆ జిల్లాలోనే అత్యధికంగా 16,64,507 మంది ఉండటం విశేషం. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 8,02,895 మందికి రెండు డోసులు వేశారు. ఇప్పటికే జనాభాలో ఎక్కువ మందికి టీకా వేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో ఐదో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. త్వరలోనే 18 ఏళ్లు దాటినవారికి రెండు డోసుల టీకా పూర్తయ్యే అవకాశం ఉంది.    

Advertisement
Advertisement