
తిరుచానూరు సమీపంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద పడేసిన ఆహారం తింటున్న అభాగ్యుడు
పెళ్లిళ్లు.. ఫంక్షన్లలో మిగిలిపోయి చెత్తకుండీల్లో చేరుతున్న ఆహార పదార్థాలు
మరోవైపు తినేందుకు తిండి లేక అభాగ్యుల ఆకలి కేకలు
తిరుపతి జిల్లాలో సగటున రోజుకు 500 కిలోల భోజనం డస్ట్బిన్ల పాలు
శుభకార్యాల నిర్వాహకులు బాధ్యతాయుతంగా ఉండాలంటున్న మేధావులు
సమాజంలో మార్పు తీసుకువస్తేనే వేలాది మంది క్షుద్బాధ తీరుతుందని సూచనలు
అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తుంటాం.. భోజనం తినే ముందు పవిత్రంగా కళ్లకు అద్దుకుంటాం.. అయితే అదే ఆహార పదార్థాలను యథేచ్ఛగా వృథా చేస్తుంటాం. వివాహాది శుభకార్యాలకు పదుల సంఖ్యలో వెరైటీలతో వంటకాలను సిద్ధం చేయిస్తుంటాం.. అతిథులు ముందు ఆర్భాటంగా వడ్డిస్తుంటాం.. గొప్పల కోసం సునాయాసంగా రూ.లక్షలు వెచ్చిస్తుంటాం.. మిగిలిపోయిన వాటిని అనాయాసంగా చెత్తకుండీల పాలు చేసేస్తుంటాం.. ఇదే తిండి లేక వేలాది డొక్కలు ఎండిపోతున్నాయని ఏమాత్రం గమనించం.. ఒక్క పూట కడుపు నిండితే చాలని ఎదురు చూస్తున్నాయని అర క్షణం కూడా ఆలోచించం.. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని పలువురు మేధావులు కోరుతున్నారు. ఆహారం వృథా చేయకుండా అభాగ్యులకు అందించే దిశగా అడుగులు వేయాలని సూచిస్తున్నారు.
తిరుపతి సిటీ : ఆహారాన్ని భగవంతుని స్వరూపంగా భావించే దేశం మనది. కానీ, భోజనాన్ని భారీగా వృథా చేస్తున్న దేశాలలో జాబితాలో మనం టాప్ ఫైవ్లో ఉండడం గమనార్హం. గృహాలు, రెస్టారెంట్లలో పండుగలు, వివాహాలు, బర్త్డేలు, ఇతర ఫంక్షన్ల పేరుతో ఆరగించేదానికన్నా వృథా చేస్తున్నదే ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత సమాజంలో చాలా మంది వివాహాల నిర్వహణ నిమిత్తం ఖర్చుకు వెనుకాడడం లేదు. ఇందుకు సామాన్య ప్రజలు సైతం అతీతులు కాదు. అందరిలో గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో తమ స్థాయికి మించి డబ్బులు వెచ్చిస్తున్నారు.
ఈ క్రమంలో నీరు, ఆహారం భారీగానే వృథా అవుతోంది. ఇళ్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలలోనూ సగటున రోజుకు 500 కిలోల వరకు ఆహరం వృథా అవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, మరో వైపు అదే ప్రాంతంలో వేల మంది ఆకలితో అలమటిస్తున్నారు. అయితే మిగిలిన ఆహార పదార్థాలను ఖాళీ కడుపుతో నకనకలాడే నిరుపేదలు, అనాథలకు చేరవేయడంలో నేటి ఆధునిక సమాజం విఫలమవుతోంది. కనీస మానవత్వం చూపించకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది.
ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటేనే..
పేదల ఆకలి తీర్చాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటేనే సాధ్యమవుతుంది. వివాహాది శుభకార్యాలలో మిగిలిన ఆహారాన్ని వృథా చేయకుండా వెంటనే కార్యనిర్వాహకులు, బంధుమిత్రులు సమీపంలోని అనాథాశ్రయాలు, రోడ్లపై అభాగ్యులకు చేరవేసే ప్రయత్నం చేయాలి. లేదా ఆహారం మిగిలిందంటూ స్వచ్ఛంద సేవాసంస్థలకు సమాచారం అందించగలగాలి. ఈ బాధ్యత కార్యక్రమానికి హాజరైన యువత, నిర్వాహకులు చేపట్టినప్పుడే సమాజంలో మార్పు వచ్చే అవకాశముంటుంది.
30శాతం చెత్తకుండీలకే..!
తిరుపతి జిల్లాలోని ప్రధాన పుణ్యక్షేత్రాలైన తిరుపతి, శ్రీకాళ హస్తిలతోపాటు మిగిలిన 33మండలాల్లో శుభముహూర్తాల సమయంలో ఏటా వేల సంఖ్యలో వివాహా లు జరుగుతుంటాయి. అందులో బోజనాలకు కనీ సం సుమారు రూ.5 లక్షల నుంచి 30 లక్షల వరకు ఖర్చు చేసి 12 నుంచి 100రకాల వంటకాలను అతిథులకు వడ్డిస్తుంటారు. ఇందులో కొందరు కేవలం రెండు, మూడు రకాలు మాత్రమే భుజించి మిగిలినవి వదిలేస్తుంటారు. కనీసం 70శాతం ఆహారం కూడా పూర్తి స్థాయిలో ఖర్చుకాదు. మిగిలిన 30 శాతం చెత్తకుండీలలో వేస్తుండడం బాధాకరం.
జిల్లా లో సుమారు 800 కల్యాణమండపాలు ఉండగా, ప్రతి దాంట్లోనూ జరిగే ఒక్కో కార్యక్రమంలో వృథా అవుతున్న ఆహారం సుమారు 50 కేజీలకు పైగా ఉంటోంది. అయితే అదే ఆధ్యాత్మిక పట్టణాలలోని ఆలయాలు, ఆస్పత్రులు,రహదారులు, పట్టణంలోని రద్దీ ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో వేల మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి కల్యాణమండపాలు, ఫంక్షన్ హాళ్లలో మిగిలిన ఆహారాన్ని అందించే నాథుడే కరువయ్యాడు. కార్యక్రమ నిర్వాహకులు, క్యాటరింగ్ యాజమాన్యాలు బాధ్యతగా వ్యహరిస్తే వృథాను అరికట్టడంతో పాటు పేదలు, అనాథల ఆకలి తీర్చే అవకాశముంటుంది.
సేవా సంస్థలు ముందుకు రావాలి
గతంలో పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఇలాంటి విషయాలలో చురుకుగా పనిచేసేవి. అయితే ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో వారు సైతం బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్వచ్ఛంద సేవాసంస్థలు, అనాథాశ్రమాల నిర్వాహకులు సమీప కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్ల మేనేజర్, సిబ్బందికి చిరునామాతో కూడిన కాంటాక్ట్ నంబర్ను ఇవ్వడం ఉత్తమం. దీంతో పాటు కల్యాణ మండపాలలోని భోజనశాలల్లో ఫోన్ నంబర్లను అంటించడం ఎంతో ఉపయోగకరం.
సమాచారం అందిస్తే చాలు
తిరుపతిలోఅనాథాశ్రయం నడుపుతున్నాం. ఇప్పటికే వందల మంది అభాగ్యుల ను అక్కున చేర్చుకుని సేవ చేస్తున్నాం. వివాహాది శుభకార్యాలలో మిగిల ఆహార పదార్థాలను వృథా చేయకుండా మాకు అప్పగిస్తే అనాథలకు చేరవేస్తాం. మాకు సమాచారం అందిస్తే చాలు. 9700440415 నంబర్కు కాల్ చేయండి.
– శ్రీదేవి, అనాథాశ్రమ నిర్వాహకులు, తిరుపతి
యువతలో మార్పు వస్తేనే..
మన దేశానికి యువతే ఆస్తి. ఖాళీ సమయాల్లో స్నేహితులతో కలసి స్వచ్ఛందంగా సేవామార్గంలో నడవాలి. యువత సైతం కళాశాల నుంచి బయటకు రాగానే సేవా భావం మరిచిపోతున్నారు. యువతలో మార్పు వస్తేనే.. సమాజంలో మార్పు ప్రారంభమవుతుంది. – భార్గవ్ సాయి, స్వచ్ఛంధ సేవా సంస్థ, ట్రెజరర్, తిరుపతి