● 11న కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులతో ఆందోళన
● మాజీ మంత్రి సాకే శైలజానాథ్
గార్లదిన్నె: చీనీ పంట సాగు చేసిన రైతుల బతుకులు చితికిపోతున్నా సీఎం చంద్రబాబు స్పందించడంలేదని వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. మండలంలోని మర్తాడులో ఎండిన చీనీ తోటలను వైఎస్సార్సీపీ నాయకులతో కలసి శుక్రవారం ఆయన పరిశీలించారు. శైలజానాథ్ మాట్లాడుతూ దక్షిణ కాలువకు లైనింగ్ పనులు చేయడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, రైతులు చీనీపంట కాపాడుకోవడానికి ట్యాంకర్లతో నీరందిస్తున్నారన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మరో రెండు నెలల్లో గ్రామంలోని చీనీ చెట్లన్నీ ఎండిపోతాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతు సమస్యలపై నిర్లక్ష్యంగా, బాధ్యతరహితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అక్కడక్కడా పంట దిగుబడి ఉన్నా ఎండల తీవ్రత, నీరు లేక పోవడంతో పాటు మార్కెట్లో గిట్టుబాటు ధర లేక రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారన్నారు. ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధులను విడుదల చేసి, రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వరి, మొక్కజొన్న, చీనీ పంటలను నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ప్రభుత్వం రైతు సమస్యలపై స్పందించకుంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాడుతామన్నారు. ఈనెల 11న రైతుల సమస్యలపై కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, యువ నాయకుడు సాకే రుత్విక్, మండల కన్వీనర్ ఎల్లారెడ్డి, ఎంపీటీసీ తిమ్మారెడ్డి, ఎస్సీ సెల్ శింగనమల నియోజకవర్గ ఇన్చార్జ్ ఆంజనేయులు, తాతిరెడ్డి, యుగంధర్రెడ్డి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


