అనంతపురం ఎడ్యుకేషన్: సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ 119వ జయంతిని నిర్వహించనున్నారు. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఖుష్బూ కొఠారి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ఎస్సీ కుల సంఘాల నాయకులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 9.30 గంటలకు సప్తగిరి సర్కిల్లోని జగ్జీవన్రామ్ విగ్రహానికి కలెక్టర్, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం 10.30 గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని డీపీఆర్సీ భవనంలో సమావేశం ఉంటుంది.
వైభవంగా అమడగూరు చౌడేశ్వరీదేవి బ్రహ్మోత్సవాలు
ఓడీచెరువు(అమడగూరు): మండల కేంద్రం అమడగూరులో వెలసిన చౌడేశ్వరీదేవి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజుచంద్రప్రభ వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామానికి చెందిన బ్రాహ్మణులు, శెట్టి బలిజలు ఉభయదారులుగా వ్యవహరించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో చౌడేశ్వరిదేవికి జ్యోతులు, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కోలాటం, చెక్క భజనలతో అలరించారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు జ్యోతి రూపంలో దర్శనం ఇవ్వనున్నారు.
ఏడీజే శైలజకు మాతృవియోగం
హిందూపురం: హిందూపురం అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజ మాతృమూర్తి సుభద్రమ్మ (87) అనారోగ్యంతో మృతి చెందారు. హెడ్ నర్స్గా ఉద్యోగ విరమణ పొందిన సుభద్రమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈక్రమంలో బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని హిందూపురం తీసుకురాగా సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు నాయక్, మడకశిర జూనియర్ సివిల్ జడ్జి అశోక్ కుమార్, స్థానిక ప్రత్యేక న్యాయమూర్తి రమణయ్య తదితరులు సుభద్రమ్మ మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతపురం, హిందూపురం, కళ్యాణదుర్గం, మడకశిర తదితర ప్రాంతాలకు చెందిన న్యాయవాదులు న్యాయమూర్తి శైలజకు సంతాపం తెలియజేశారు. అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం పుంగనూరుకు తరలించారు.


