అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి మూల్యాంకన విధుల కేటాయింపులో భాషోపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని పండిత పరిషత్ (ఆర్యూపీపీ) నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు, హిందీ తదితర భాషల విషయంలో క్యాడర్ సీనియారిటీ కాకుండా బోధనా అనుభవాన్ని ప్రాధాన్యతగా పరిగణించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ వెంకటేష్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పండిత పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు సి. ఎర్రిస్వామి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు హనుమేష్, ప్రధాన కార్యదర్శి జి. తులసి రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం అమలులో ఉన్న విధానంలో క్యాడర్ ఆధారంగా మూల్యాంకన విధులు కేటాయిస్తున్నారని, దీంతో 25 నుంచి 30 ఏళ్ల బోధనానుభవం ఉన్న ఉపాధ్యాయులు మూల్యాంకన బాధ్యతలకు దూరమవుతున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలో భాషోపాధ్యాయుల విషయంలో ఎల్పీ కేడర్ నుంచి అనుభవాన్ని లెక్కలోకి తీసుకుని మూల్యాంకన విధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రైవేట్ బస్సును ఢీకొన్న ట్రాక్టర్
బెళుగుప్ప: మండలంలోని గుండ్లపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఓ ప్రైవేటు బస్సును ట్రాక్టర్ ఢీకొంది. బళ్లారి వైపు ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ బస్సును గమనించకుండా ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్ను రివర్స్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.


