● పలు చోట్ల నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
శెట్టూరు: జిల్లాలో పలు చోట్ల మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. గాలీవానకు శెట్టూరు మండలం తిప్పనపల్లిలో నాలుగు విద్యుత్ స్తంభాలు, పలు చెట్లు నేలవాలాయి. ఇంకా మామిడి, ఇతర పంటలు దెబ్బ తిన్నాయి. గ్రామంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. గుత్తిలోనూ భారీ వర్షం పడింది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
వజ్రకరూరు: మండల కేంద్రం వజ్రకరూరులో మంగళవారం సాయంత్రం గంటపాటు మోస్తరు వర్షం కురిసింది. పలువీధులు జలమయమయ్యాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
ఈదురు గాలులకు నేలకొరిగిన అరటి
కూడేరు: మండల పరిధిలో మంగళవారం ఈదురు గాలులు వీచాయి. జల్లిపల్లిలో రైతు దేవేంద్రకు చెందిన మూడు ఎకరాల్లోని అరటి చెట్లు నేలకొరిగాయి. ముద్దలాపురం, కొర్రకోడు, మరుట్ల, ఇప్పేరు, గొటుకూరు, కూడేరుతో పాటు మరికొన్ని గ్రామాల్లో మొక్కజొన్న, అరటి పంట నేలకొరిగింది. ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేయించి ఆర్ధిక సహాయం అందజేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


