పుట్టపర్తికి పెరిగిన భక్తుల రద్దీ
పుట్టపర్తి అర్బన్: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు నేపథ్యంలో ప్రశాంతి నిలయానికి భక్తుల తాకిడి పెరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైలు మార్గం ద్వారా ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ చేరుకుంటున్నారు. దీంతో స్టేషన్ ఆవరణ భక్తులతో కిటకిటలాడుతోంది. ఉదయం నుండి రాత్రి వరకూ భక్తులు వస్తూనే ఉన్నారు. సోమవారం ప్రశాంతి రైల్వే స్టేషన్ మీదుగా 16 రైళ్లు రాక పోకలు సాగించాయి. ఇందులో 6 రైళ్లు బెంగళూరు నుంచి రాగా, మిగతా 10 రైళ్లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చాయి. రైల్వే స్టేషన్కు వచ్చిన భక్తులకు, సిబ్బందికి అక్కడే మూడు పూటలా భోజన వసతి, వైద్య సేవలు అందిస్తున్నారు. అక్కడే హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి నిలయం చేరుకునేందుకు ఉచిత ఆర్టీసీ బస్సులను సిద్ధంగా ఉంచారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో సత్యసాయిసేవాదళ్ సభ్యులు ఎప్పటికప్పుడు స్టేషన్ ఆవరణను శుభ్రం చేస్తున్నారు.
కొన.. సాగుతున్న ఏర్పాట్లు
సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల కోసం చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిలో చంద్రబాబు ప్రభుత్వం నత్తతో పోటీ పడుతోంది. శత జయంతి వేడుకలు ప్రారంభమై 6 రోజులైనా ఇప్పటికీ పట్టణంలో నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ 19న పుట్టపర్తికి విచ్చేస్తున్న నేపథ్యంలో ప్రధాన రహదారిపై పోలీసులు ఆంక్షలు విధించి వాహన రాకపోకలను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. అయితే ఆయా రోడ్ల నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతుండటం.. హిటాచీలు, జేసీబీలు ట్రాక్టర్లు అడ్డు వస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక చిత్రావతి నదిని ఆనుకుని రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఇంకా తారువేయడంలోనే ఉన్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు, కలెక్టర్ ఏర్పాట్లపై పలు మార్లు సమీక్షలు చేసినా... కాంట్రాక్టర్లు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు.
● చిత్రావతి నది రహదారితో పాటు ఆర్టీసీ డిపో వద్ద ఏర్పాటు చేస్తున్న చిన్న పార్కు పనులు ఇంకా నాలుగు రోజులైనా పూర్తయ్యే అవకాశం లేదు. ఇప్పటికీ కూలీలు నిర్మాణ పనుల్లోనే కనిపిస్తున్నారు.
● రైల్వే స్టేషన్ నుంచి పుట్టపర్తికి వచ్చే ప్రధాన రహదారి డివైడర్ల మధ్య మొక్కలు కత్తిరింపు పనులు కూడా సోమవారం నాటికీ పూర్తి కాలేదు.
● మామిళ్లకుంట క్రాస్ వద్ద డివైడర్ల మధ్య పిచ్చి మొక్కలు తొలగించడం, శుభ్రం చేసే పనులు రోజుల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. మరో 5 రోజుల్లో ఉత్సవాలు ముగుస్తాయని, ఆలోపైనా పనులు పూర్తి చేస్తారా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్


