శాంతినారాయణకు జీవిత సాఫల్య పురస్కారం
అనంతపురం కల్చరల్: జిల్లాకు చెందిన కవి డాక్టర్ శాంతినారాయణకు అమృతలత సాహిత్య జీవన సాఫల్య పురస్కారం–2024 వరించింది. ఈ మేరకు గురువారం పురస్కార ప్రదాత డాక్టర్ అమృతలత ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 2న నిజామాబాద్లో జరగనున్న కార్యక్రమంలో ఆయనకు పురస్కారంతో పాటు రూ.25 వేల నగదు అందించనున్నట్లు వెల్లడించారు. తెలుగు కథా సాహిత్యంలో విలక్షణ రచయితగా శాంతినారాయణ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇప్పటి వరకు 70 కథానికలు, నాలుగు నవలలు, నాగలకట్ట సుద్దులు (రెండు సంపుటాలు’ రచించారు. విమలా శాంతి సామాజిక సేవా సమితి ద్వారా యువ రచయితలు, కవులకు పురస్కారాలు అందించి ప్రోత్సహిస్తున్నారు. డాక్టర్ శాంతినారాయణ సాహిత్య కృషిని గుర్తించిన గత ప్రభుత్వం ఆయనకు ‘డాక్టర్ వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారం’ అందించి గౌరవించింది. ఇదే క్రమంలో మరో ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికై న శాంతినారాయణకు పలువురు రచయితలు, కవులు అభినందనలు తెలిపారు. సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న శాంతినారాయణ అనంత ఖ్యాతిని ఘనంగా చాటారని ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, జనప్రియకవి ఏలూరు యంగన్న హర్షం వ్యక్తం చేశారు.


