
జిల్లా ఉద్యాన శాఖ పరిస్థితి అధ్వానంగా తయారైంది. కూటమి స
● కాగితాల్లోనే పథక నిర్దేశన, బడ్జెట్ కేటాయింపులు
● గతేడాది రూ.18.87 కోట్లకు గానూ రూ.7.98 కోట్లే ఖర్చు
● ఈ ఏడాది రూ.16.14 కోట్లలో సగం ఖర్చు కూడా అనుమానమే
● సర్కారు తీరుతో ఇబ్బందులు పడుతున్న రైతులు
అనంతపురం అగ్రికల్చర్: చంద్రబాబు ప్రభుత్వం ఒక చేత్తో బడ్జెట్ చూపించి మరో చేత్తో వెనక్కి లాగేసుకుంటూ రైతులకు ఫలాలు అందకుండా చేస్తోంది. 2024–25లో పథకాలు, బడ్జెట్ కేటాయింపులు, ఖర్చు చేసిన సొమ్ము, సాధించిన ప్రగతి చూస్తే... కూటమి సర్కారు నిర్లక్ష్యం, ఉద్యానశాఖ పనితీరు స్పష్టంగా అర్థమవుతుంది. గతేడాది జిల్లాలో ఉద్యానశాఖ ద్వారా అమలు చేసే పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.18.86 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించింది. అందులో సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం (ఎంఐడీహెచ్) కింద 7,820 మంది రైతులకు సంబంధించి రూ.15.23 కోట్లు కేటాయించినా... ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.7.10 కోట్లు వెచ్చించి 3,950 మందికే ఫలాలు అందించారు. రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్కేవీవై) కింద నాణ్యమైన కూరగాయల విత్తనాల పంపిణీకి రూ.1.30 కోట్లు కేటాయించగా ఖర్చు చేసింది మాత్రం రూ.8.50 లక్షలు కావడం గమనార్హం. ఆయిల్ఫాం కింద కణేకల్లు, కూడేరు, బొమ్మనహాళ్, ఉరవకొండ, వజ్రకరూరు, డీ.హీరేహాళ్ మండలాల్లో పామాయిల్ తోటల అభివృద్ధికి రూ.2.31 కోట్లు కేటాయించగా... కేవలం రూ.79 లక్షలు ఖర్చు చేశారు. ఎన్బీఎం, సీడీబీ కింద రూ.2.87 కోట్లు కేటాయించగా రూ.1.31 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇలా గతేడాది రూ.18.87 కోట్లు కేటాయించగా చివరకు రూ.7.98 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ క్రమంలో ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు వివిధ పథకాల కింద రూ.16.14 కోట్లు మేర బడ్జెట్ కేటాయించారు. ఈ సారి సగం కూడా ఖర్చు చేసే పరిస్థితి లేదని చెబుతున్నారు.
విస్తీర్ణంలో టాప్..
జిల్లాల విభజన జరిగిన తర్వాత కూడా ఉద్యాన తోటల విస్తీర్ణంలో ‘అనంత’ మొదటి స్థానంలో ఉంది. యాపిల్ లాంటి నాలుగైదు రకాలు మినహా మిగతా అన్ని రకాల ఉద్యాన తోటలకు నిలయంగా మారింది. జిల్లా నుంచి చీనీ, అరటి, దానిమ్మ, టమాట, గులాబీ తదితర ఉత్పత్తులు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. ఢిల్లీలో పేరున్న అజాద్పూర్ మండీలో ‘అనంత’ ఉద్యాన ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. వేలాది మంది ఉద్యాన రైతులు, లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు, రూ.వేల కోట్ల టర్నోవర్ పరంగా జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది. వేలాది మంది రైతులు వ్యవసాయ పంటలను తగ్గించి అంతో ఇంతో నీటి వనరుల కింద పండ్లు, పూలు, కూరగాయలు తదితర ఉద్యాన పంటలు సాగు చేస్తున్న పరిస్థితి నెలకొంది. తాజా నివేదికల ప్రకారం 3 లక్షల ఎకరాల్లో ఉద్యాన తోటలు ఉండగా... అందులో 1.80 లక్షల ఎకరాల్లో పండ్లతోటలు, 55 వేల ఎకరాల్లో కూరగాయ పంటలు, 40 వేల ఎకరాల్లో సుగంధం, ఔషధ పంటలు, పూలతోటలు సాగులో ఉన్నాయి. ఏకంగా 72 రకాల ఉద్యాన తోటలు సాగవుతున్నట్లు ఈ–క్రాప్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. వాటి ద్వారా ఏటా 38 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఫలసాయం వస్తోంది. రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు టర్నోవర్ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల కారణంగా చీడపీడలు, తెగుళ్ల బెడద అధికంగా ఉంటోంది. అకాల వర్షాలు, ఈదురుగాలులు ఏటా దెబ్బతీస్తున్నాయి. అలాగే మార్కెటింగ్ సమస్య రైతులను వేధిస్తోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉద్యాన తోటలు సాగు చేస్తున్న రైతులకు బాసటగా నిలవాల్సిన కూటమి సర్కారు, ఉద్యానశాఖ కంటితుడుపుగా పథకాలు అమలు చేస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.