
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
అనంతపురం: ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. ఒక బీసీ మహిళ జెడ్పీ చైర్పర్సన్ హోదాలో ఉంటే కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారింది’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ ధ్వజమెత్తారు. జెడ్పీ చైర్పర్సన్ చాంబర్లోకి ముగ్గురు ఎమ్మెల్యేలు చొరబడి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటోను ధ్వంసం చేయడంపై నిరసన తెలిపారు. అప్రజాస్వామికంగా వ్యవహరించిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ అనంతపురం టూటౌన్ పోలీస్స్టేషన్లో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్తో కలిసి గురువారం ఫిర్యాదు చేశారు. అనంతరం గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ భేటీ బచావో..భేటీ పడావో అంటూ దేశంలో మహిళల సర్వతోముఖాభివృద్ధి వైపు అడుగులు వేస్తుంటే రాష్ట్రంలో మాత్రం మహిళలను అవమానపరుస్తున్నార న్నారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ చాంబర్ లోకి ఎమ్మెల్యేలు దౌర్జన్యంగా వెళ్లి ఆమె ప్రతిష్టను దెబ్బతీసే రీతిలో వ్యవహరించారన్నారు. జెడ్పీ చైర్పర్సన్ అనుమతి లేకుండా చాంబర్లోకి వెళ్లి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటో కిందపడేసి, ధ్వంసం చేశారని, సీఈఓను భయభ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. జెడ్పీ సమావేశం జరుగుతుండగా, గందరగోళమైన పరిస్థితిని సృష్టించారన్నారు. ప్రజాస్వామ్య వాదులంతా తలదించుకునే రీతిలో ప్రవర్తించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ నుంచి జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటో పెట్టుకోవడం ఆమెకు ఉన్న హక్కు అని పేర్కొన్నారు. బోయ సామాజికవర్గానికి చెందిన గిరిజమ్మను అవమానపరిచే రీతిలో ప్రవర్తించడం చాలా బాధాకరమన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలే దౌర్జన్యాలకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. ఏకంగా జెడ్పీ చైర్పర్సన్నే అవమానానికి గురిచేయడం, వారి అనుచరులు మేయర్ వసీం సలీం చాంబర్లోనూ ఇదే తరహాలో ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు దాదు, జిల్లా సభ్యులు పావురాల జగదీష్, యువజన విభాగం నగర ఉపాధ్యక్షులు ఉదయ్, వినీత్, జనరల్ సెక్రెటరీ బిల్లే నాగార్జున, సెక్రెటరీలు వేణు, మైను, బ్రహ్మానంద రెడ్డి, వెంకట సుబ్బారావు, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాకే శ్రీనివాసులు, స్టేట్ స్పోక్ పర్సన్ సాకే చిరంజీవి, నాగార్జున నాయక్, గౌతమ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ మహిళ ప్రతిష్టకు
భంగం కలిగించారు
ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి
వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్