జెడ్పీలో బదిలీలకు రంగం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

జెడ్పీలో బదిలీలకు రంగం సిద్ధం

May 30 2025 1:33 AM | Updated on May 30 2025 1:33 AM

జెడ్ప

జెడ్పీలో బదిలీలకు రంగం సిద్ధం

అనంతపురం సిటీ: జిల్లా పరిషత్‌ పరిధిలో ఉద్యోగుల బదిలీలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని జిల్లా, మండల పరిషత్‌ సహా అనుబంధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జాబితా ఇప్పటికే పూర్తి స్థాయిలో రూపొందించారు. ఒకే చోట ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ తరువాత అవకాశాన్ని బట్టి రిక్వెస్ట్‌ బదిలీలకు చోటు కల్పించాలని సూచించింది.

బదిలీల కోసం వచ్చిన దరఖాస్తులు 236

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జెడ్పీ యాజమాన్యం పరిధిలో పని చేస్తున్న వారిలో 236 మంది ఉద్యోగులు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నట్లు సీఈఓ వెంకటసుబ్బయ్య తెలిపారు. వీరిలో ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారు 136 మంది ఉండగా 131 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే రిక్వెస్ట్‌ బదిలీల కోసం ఏకంగా వంద మంది దరఖాస్తు చేసుకున్నారు. అటెండర్లలో 64 మంది ఒకేచోట ఐదేళ్లు పూర్తి చేసుకోగా బదిలీల కోసం 59 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.

జాబితా సిద్ధం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిషత్‌ కార్యాలయాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంత మందిని బదిలీ చేయవచ్చనే సమగ్ర వివరాలతో కూడిన ప్రత్యేక బృందం రూపొందించిన జాబిత పరిశీలన కోసం సీఈఓ వెంకటసుబ్బయ్య టేబుల్‌పైకి గురువారం చేరింది. ఆయన జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. కొందరు అటెండర్లు పదేళ్లుగా ఒకే చోట పాతుకుపోయారు. మరి కొందరు జిల్లా కేంద్రం దాటి బయటకు పోవడం లేదు. ఇక్కడిక్కడే జెడ్పీ లేదా పీఆర్‌ఐ, పీఐయూ, క్యూసీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇలా ఏదో ఒక ఆఫీసుకు బదిలీ చేయించుకోవడం పరిపాటిగా మారింది. జెడ్పీలో పని చేస్తూ ఏడాది కిందట ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన వారు తిరిగి జెడ్పీకి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. కూటమి ప్రజాప్రతినిధుల ఇళ్లు, జెడ్పీ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇంకొందరు అనారోగ్యం సాకు చూపిస్తూ అందుకు అనుగుణంగా సర్టిఫికెట్లు సైతం సృష్టించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నేడు తుది ఆమోదం

ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైల్‌ను జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ వద్దకు శుక్రవారం పంపనున్నారు. ఆమె పరిశీలించి ఆమోదం తెలిపిన తరువాత బదిలీలకు సంబంధించి కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. శని లేదా ఆదివారంలోపు కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగించే ఆలోచనలో జెడ్పీ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.

సీఈఓ వెంకటసుబ్బయ్య పరిశీలనకు అర్హుల జాబితా

నేడు జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ అనుమతి కోసం ఫైల్‌

జెడ్పీలో బదిలీలకు రంగం సిద్ధం 1
1/1

జెడ్పీలో బదిలీలకు రంగం సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement