
ట్రాక్టర్ నగర్ డైరెక్టర్గా డాక్టర్ పీపీ రావు
గార్లదిన్నె: మండల పరిధిలోని దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల, శిక్షణ, పరీక్షణ సంస్థ (ట్రాక్టర్ నగర్) డైరెక్టర్గా గురువారం డాక్టర్ పీపీ రావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఆ స్థానంలో పనిచేసిన డాక్టర్ బాలాజీ మురారి నాందేడ్ను మధ్యప్రదేశ్లోని బుద్ని సంస్థకు బదిలీ చేశారు. కాగా, డాక్టర్ పీపీ రావు 2016 నుంచి 2022 వరకు ట్రాక్టర్ నగర్ డైరెక్టర్గా పని చేశారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.
జర్నలిస్టుల అక్రిడిటేషన్
కాలపరిమితి పొడిగింపు
అనంతపురం అర్బన్: జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని మరో మూడు నెలలు పొడిగించినట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ నిర్ణయం మేరకు అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని జూన్ ఒకటి నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు లేదా కొత్త కార్డులు జారీ చేసే వరకు (ఏది ముందు జరిగితే అప్పటి వరకు) పొడిగించినట్లు పేర్కొన్నారు.
పంచాయతీ నిధుల
దుర్వినియోగంపై విచారణ
గుంతకల్లు రూరల్: గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో డీఎల్పీఓ విజయ్కుమార్ గురువారం విచారణ చేపట్టారు. 2020 నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకూ గుంతకల్లు మండలంలోని 25 గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన నిధులను అభివృద్ధి పనులు చేపట్టకుండా అధికారులు, సర్పంచులు ఉమ్మడిగా కాజేశారంటూ ధర్మహ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ అధికారిగా డీఎల్పీఓ విజయ్కుమార్ నియమించడంతో ఆయన గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో వీరాంజనేయులు సమక్షంలో వివిధ గ్రామ పంచాయతీల కార్యదర్శులను విచారిస్తూ రికార్డులు పరిశీలించారు.
5న జాబ్ మేళా
అనంతపురం: ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో జూన్ 5న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లా రెడ్డి తెలిపారు. ఎంపికై న వారు ఐఆర్ఈపీ సంస్థ (ఎన్బీఎఫ్సీ)లో అనంతపురం, రాయదుర్గం, తాడిపత్రి, ప్రొద్దుటూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, చిత్తూరు, హిందూపురం, కదిరి ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. సేల్స్ ఆఫీసర్, సీనియర్ సేల్స్, ఆఫీస్ అడ్మిన్, కలెక్షన్ ఎక్జిక్యూటీవ్ ఉద్యోగాలకు డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి 35 సంవత్సరాల్లోపు వయసు న్న వారు అర్హులు. ఎన్బీఎఫ్సీ, ఎంస్ఈ, ఎంఎస్ఎంఈల్లో అనుభవం తప్పనిసరి. ఎంపికైన వారికి రూ.3.6 లక్షల వార్షిక వేతనం, రూ.2.4 లక్షల వార్షిక వేతనం అందిస్తారు.