
ఆర్టీసీలో ఆగని దోపిడీ
అనంతపురం క్రైం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీలో పాలన పూర్తిగా గాడి తప్పింది. అధికారంలో ఉన్నప్పుడే అందిన కాడికి దోచుకోవాలనే తీరుతో కొందరు ఉద్యోగులు బరితెగించారు. అక్రమాలకు తెరలేపి సంస్థ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. విషయం బయటకు పొక్కితే బదిలీ చేస్తారు.. అప్పటి వరకూ జేబులు నింపుకుంటే చాలు అనే ఫార్ములాను అనుసరిస్తూ రూ.లక్షలు దిగమింగుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్రమార్కుల కొమ్ము కాస్తున్న ఆర్ఎం తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మచ్చుకు కొందరి అక్రమాలు ఇలా..
ఉరవకొండ డిపోలో మేనేజరుగా పనిచేసిన ఓ ఉద్యోగి తీరు కారణంగా ఆర్టీసీకి రూ. 42 లక్షల రాయితీ దక్కకుండా పోయింది. ఈ విషయం కాస్త బహిర్గతం కావడంతో ఆయన గుట్టుచప్పుడు కాకుండా స్వచ్చంద ఉద్యోగ విరమణ చేసి తప్పుకున్నారు. ఈ విషయం తెలిసినా.. ఆర్ఎం ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఆయన ఉద్యోగ విరమణ ఫైల్కు క్లీన్చిట్ ఇచ్చి పూర్తి స్థాయిలో సహకరించారు. అంతేకాక చాలా కాలం ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. చివరకు విషయం వెలుగు చూడడంతో అలాంటి పొరపాటు జరగలేదని బుకాయించారు. కాగా, ఇదే అంశంపై గతంలో రాష్ట్ర స్థాయిలో జరిగిన సమావేశంలో ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు చర్చ లేవనెత్తడం గమనార్హం. జల్లిపల్లి, మరూరు, కాశేపల్లి, రామాపురం వద్ద ఉన్న నాలుగు టోల్ గేట్లకు బస్సులకు రాయితీ పాసులు ఎందుకు పొందలేదని ఆరా తీసినట్లు సమాచారం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డిపో మేనేజరుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసినట్లు తెలిసింది. చిరు ఉద్యోగుల తప్పిదాలను భూతద్దంలో చూసి కఠినంగా శిక్షించే అధికారులు... అదే ఉన్నత కేడర్లో ఉన్న వారి పట్ల సానుకూలంగా వ్యవహరిస్తుండడం ప్రస్తుతం కార్మికుల్లో అసహనం రేకెత్తిస్తోంది.
వెలుగు చూడని దారుణాలెన్నో
ఆర్టీసీలోని కీలక విభాగాల్లో అనేక తప్పిదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఆర్టీసీలోని విజిలెన్స్ లాంటి కీలక విభాగం కూడా ఆర్ఎం కనుసన్నల్లో పని చేస్తోంది. ఆర్ఎం చాంబర్ వద్ద విజిలెన్స్ కానిస్టేబుల్ ఒకరిని కాపలాగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అన్ని విభాగాలను ఇక్కడ అధికారులు వారి సొంత పనులకు వినియోగించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఆర్టీసీ బస్టాండులో నో పార్కింగ్ పేరుతో వసూలు చేస్తున్న డబ్బును విజిలెన్స్ సిబ్బంది వాటాలు వేసుకుని పంచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అనంతపురం ఆర్టీసీ రీజియన్లోని అన్ని విభాగాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తే దారుణాలెన్నో వెలుగు చూసే అవకాశం లేకపోలేదు.
కార్గొ సేవల్లోనూ అక్రమాలు
ఆర్టీసీలో కార్మికుల కష్టంతో వచ్చే ఆధాయాన్ని ఎలా దోచుకోవాలో కొంత మంది ఉద్యోగులకు బాగా వంటబట్టింది. ఇందుకు కార్గొ సేవలే ఉదాహరణ. కార్గొ కార్యకలాపాలను పర్యవేక్షించే అధికారికి వాహనం ఏర్పాటు చేసుకునే వెసులు బాటును ఆ సంస్థ కల్పించింది. అయితే సదరు అధికారి వాహనం లేకుండా నెట్టుకొస్తూ రికార్డులు సృష్టించి నెలకు రూ.30 వేలు చొప్ను తన సొంత ఖాతాలోకి వేసుకుంటున్నట్లు సమాచారం. అద్దె వాహనం పేరుతో ఏడాదికి పైగా రూ.3.60 లక్షలు లూటీ చేసినట్లు ఆధారాలతో సహా ఇటీవల పట్టుబడిన ఆ అధికారిపై నేటికీ ఎలాంటి చర్యలు లేవు.
రూ.లక్షలు దండుకుంటున్న ఉద్యోగులు
అటకెక్కిన ఉరవకొండ డిపోలో రూ.42 లక్షల గోల్మాల్
జిల్లా కేంద్రంలో అద్దె వాహనం పేరుతో రూ.3.60 లక్షలు స్వాహా
ఏ ఒక్కరిపై కనిపించని చర్యలు
ఆర్ఎం తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు