
ఏఐజీడీఏ జోనల్ కార్యదర్శిగా రమేష్బాబు
అనంతపురం ఎడ్యుకేషన్: ఆలిండియా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం (ఏఐజీడీఏ) కన్ఫరడేషన్ జోనల్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, గోవా, ఒడిశా) సెక్రెటరీగా జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు పి.రమేష్బాబును నియమించారు. ఆదివారం ఆలిండియా గవర్నమెంట్ డ్రైవర్ల సంఘం కన్ఫడరేషన్ సమావేశం చత్తీస్ఘడ్లో జరిగింది. 18 రాష్ట్రాల నుంచి సంఘం అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐజీడీఏ కన్ఫరడేషన్ జోనల్ కార్యదర్శిగా రమేష్బాబుకు నియామక ఉత్తర్వులను ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు అందజేశారు.
ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి
పామిడి: ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామానికి చెందిన వడ్ల చంద్రశేఖర్(38) అలియాస్ శేఖర్ చీనీ, వేరుశనగ, వడ్ల వ్యాపారంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వ్యాపారంలో భాగంగా పామిడికి చెందిన పిక్కిలి రామకృష్ణతో కలసి శనివారం గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామానికి వెళ్లాడు. అక్కడ పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై అర్ధరాత్రి తిరుగు ప్రయాణమైన భోజనం చేసేందుకు 44వ జాతీయ రహదారిపై ఉన్న ఓ ధాబాకు చేరుకున్నారు. అప్పటికే మూసేయడంతో ధాబా సమీపంలోనే ద్విచక్ర వాహనం వద్ద నిలబడి మాట్లాడుకుంటుండగా... ఖల్సా ధాబా యజమాని తేజ ట్రాక్టర్పై వస్తూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు. ఘటనలో ట్రాక్టర్ అదుపు తప్పి చంద్రశేఖర్పై పడడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, చంద్రశేఖర్కు భార్య లక్ష్మి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
హెచ్ఎం నిర్ధారించకుండానే ఎంఈఓ ఆమోదం
అనంతపురం ఎడ్యుకేషన్: ఆన్లైన్లో బదిలీలకు దరఖాస్తు చేసుకున్న స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి దరఖాస్తుల హార్డ్కాపీలను సంబంధిత హెచ్ఎంలు నిర్ధారించి...వాటిని ఎంఈఓలకు అందజేస్తే వారి లాగిన్లో ఆమోదించాల్సి ఉంది. ఈ ప్రక్రియకు ఆదివారం తుది గడువు. ఇంతటి కీలక సమయంలో ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం సుబ్రహ్మణ్యం మూడు రోజులుగా పత్తా లేకుండా పోయాడు. దరఖాస్తు చేసుకున్న టీచర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎంఈఓ రవికుమార్ను అడిగితే...హెచ్ఎం నిర్ధారించిన తర్వాతనే లాగిన్లో అప్లోడ్ చేస్తానని స్పష్టం చేశారు. అయితే స్కూల్ అసిస్టెంట్ల దరఖాస్తులను పరిశీలించి... ఎంఈఓలు తమ లాగిన్లో అప్లోడ్ చేసేందుకు ఆదివారమే చివరి గడువు కావడంతో దరఖాస్తు చేసుకున్న ఆ స్కూల్ టీచర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని డీఈఓ, గుత్తి డీవైఈఓ దృష్టికి తీసుకెళ్లారు. వారు నేరుగా ఎంఈఓ రవికుమార్తో మాట్లాడారు. డీఈఓ మౌఖిక ఆదేశాల మేరకు చివరి నిముషంలో ఎంఈఓ అప్లోడ్ చేశారు.