
ముచ్చుకోట స్కూల్ హెచ్ఎంకు షోకాజ్
అనంతపురం ఎడ్యుకేషన్: విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యంకు షోకాజ్ నోటీసు జారీ అయింది. కీలకమైన టీచర్ల బదిలీల ప్రక్రియపై అలసత్వం వహించిన ఆయన తన స్కూల్లో బదిలీలకు దరఖాస్తు చేసుకున్న టీచర్లకు సంబంధించిన హార్డ్కాపీలపై కౌంటరు సంతకాలు చేయకపోవడమే కాక, వారికి అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. ఫోన్లు చేసి అడిగితే.. ‘నేను ఎంఈఓకు చెప్పాను వెళ్లి ఆయనను కలవండి. మీ దరఖాస్తును లాగిన్లో ఆమోదం తెలుపుతారని’ చెపుతూ వచ్చాడు. ఆ టీచర్లు ఎంఈఓను కలవగా... హెచ్ఎం కౌంటర్ సంతకం లేకుండా తాను ఓకే చేయలేనంటూ తెగేసి చెప్పాడు. ఆదివారం చివరి రోజు కావడం... హెచ్ఎం అందుబాటులోకి రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన టీచర్లు చివరకు విషయాన్ని డీఈఓ ప్రసాద్బాబు దృష్టికి తీసుకెళ్లారు. డీఈఓ పలుమార్లు ఫోన్ చేసినా సదరు హెచ్ఎం మొబైల్ పని చేయలేదు. చేసేదిలేక ఎంఈఓను ఆఫీసుకు పిలిపించి ఆ టీచర్ల దరఖాస్తులన్నీ ఆమోదం తెలపాలని సూచించారు. డీఓఈ ఆదేశాలతో ఎంఈఓ తన లాగిన్లో ఆమోదం తెలిపారు. ఈ వ్యవహారంపై ‘హెచ్ఎం నిర్ధారించకుండానే ఎంఈఓ ఆమోదం’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. సమస్యను కొందరు పాఠశాల విద్య డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు హెచ్ఎం సుబ్రహ్మణ్యంకు డీఈఓ షోకాజ్ నోటీసు జారీ చేశారు. నోటీసు అందుకున్న మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.