
రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ
గుంతకల్లు: స్థానిక సిద్ధార్థ నగర్లో నివాసముంటున్న రైల్వే ఉద్యోగి ఇంట్లో దుండగులు చొరబడి విలువైన సామగ్రిని అపహరించారు. వివరాలు.. పట్టణ శివారులోని సివిల్ న్యాయస్థానం వెనుక సిద్ధార్థ నగర్లో రైల్వే బుకింగ్ ఆఫీస్లో క్లర్క్గా పనిచేస్తున్న శరత్ నివాసముంటున్నారు. కుటుంబసభ్యులందరూ హైదరాబాద్కు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న శరత్ శనివారం ఇంటికి తాళం వేసి నైట్ డ్యూటీకి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దుండగులు శనివారం ఆర్ధరాత్రి దాటిన తర్వాత శరత్ ఇంటి తాళాన్ని చిన్నపాటి కడ్డీతో తొలగించి లోపలకు ప్రవేశించారు. బెడ్రూమ్లో బీరువాకే తాళాలు ఉండడం గమనించి అందులోని 12 తులాల బంగారు నగలు అపహరించారు. అనంతరం ఆ పక్కనే నివాసముంటున్న మున్సిపల్ విశ్రాంత అధికారి ఓ.రామాంజనేయులు (తన బంధువుల ఇంట శుభకార్యం ఉండడంతో ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి బెంగళూరుకు వెళ్లారు) ఇంటికి వేసిన తాళం గుర్తించి లోపలకు చొరబడ్డారు. బీరువాలోని నాలుగు తులాల బంగారు నగలతో పాటు కొంత నగదు అపహరించినట్లు సమాచారం. రామాంజనేయులు బెంగళూరులో ఉండటంతో ఎంత మొత్తం చోరీ అయింది తెలియరాలేదు. ఆయన వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత కేసు నమోదు చేస్తామని గుంతకల్లు రూరల్ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. అలాగే రైల్వే ఉద్యోగి శరత్ ఇంటినీ పరిశీలించి, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
డ్రిప్ టార్గెట్ 18 వేల హెక్టార్లు
● ఇంకా ఏపీఎంఐపీకి అందని గ్రీన్సిగ్నల్
అనంతపురం అగ్రికల్చర్: ఈ ఏడాది జిల్లాకు డ్రిప్, స్ప్రింక్లర్ల టార్గెట్ 18 వేల హెక్టార్లు ఇచ్చినట్లు ఏపీఎంఐపీ వర్గాలు తెలిపాయి. అయితే నియమ నిబంధనలు ప్రకటించలేదన్నారు. ఈ ఏడాది 5 ఎకరాల్లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాల రైతులకు 100 శాతం రాయితీతో పంపిణీ చేయనున్నట్లు సమాచారం. అలాగే 10 ఎకరాల్లోపు ఉన్న ఇతర రైతులకు 90 శాతం రాయితీని వర్తింపజేయనున్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు ఏపీఎంఐపీకి అందకపోవడంతో ఎలాంటి ప్రకటన జారీ చేయకుడా మిన్నకుండిపోతున్నారు. ప్రస్తుతం గతేడాది అర్హులైన రైతుల్లో ఇంకా చాలా మందికి మెటీరియల్ సరఫరా చేస్తూ ఉన్నారు. అడిగిన ప్రతి రైతుకూ సూక్ష్మ సేద్యం పరికరాలు ఇవ్వాలనే ఆలోచనతో ఆర్బాటంగా మొదట జిల్లాకు 42,100 హెక్టార్లు టార్గెట్ ఇచ్చిన కూటమి సర్కారు... రాను రాను తగ్గిస్తూ చివరకు 18 వేల హెక్టార్లకు కుదించింది. ఇందులో 12,635 మంది రైతులకు 15,060 హెక్టార్లకు డ్రిప్ పరికరాలు అందించగా... 2,234 మంది రైతులకు 2,582 హెక్టార్లకు స్ప్రింక్లర్ సెట్లు అందించారు. ఇలా మొత్తంగా 14,869 మంది రైతులకు 17,642 హెక్టార్లకు డ్రిప్, స్ప్రింక్లర్లు మంజూరు చేశారు. ఇంకా మెటీరియల్ సరఫరా, ఇన్స్టాలేషన్ పూర్తి కాలేదు. ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 35 రోజులు కావస్తున్నా... ఇంకా టార్గెట్ల వద్దనే ఆగిపోయారు. ఇప్పటికే 30 వేల మంది వరకు రైతులు పరికరాల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు.
గొర్రెల వ్యాపారిని బెదిరించి రూ. 6.80 లక్షల అపహరణ
బుక్కరాయసముద్రం: మండలంలోని ఉప్పరపల్లి పరిధిలో గొర్రెల వ్యాపారిని దుండగులు అటకాయించి నగదు దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన మేరకు.. బీకేఎస్కు చెందిన నారాయణస్వామి గొర్రెల వ్యాపారంతో జీవనం సాగిస్తున్నాడు. శనివారం అనంతపురం మార్కెట్ యార్డులో గొర్రెలు విక్రయించగా వచ్చిన డబ్బుతో అనంతపురం రూరల్ పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో గొర్రెలు కొనుగోలు చేసేందుకు తన స్కూటీ వాహనంపై బయలుదేరాడు. దేవరకొండ – ఉప్పరపల్లి మధ్యలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన నలుగురు వ్యక్తులు ముఖానికి మాస్క్ వేసుకుని నారాయణస్వామిని అడ్డుకున్నారు. డబ్బు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించి, అతని వద్ద ఉన్న రూ.6.80 లక్షలు లాక్కొని ఉడాయించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.
క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
గార్లదిన్నె: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గార్లదిన్నె పీఎస్లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ వెకంటేషులు వెల్లడించారు. గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన రాజశేఖర్, శింగనమల మండలం తరిమెల గ్రామానికి చెందిన సుధీర్రెడ్డి, భాస్కరరెడ్డి జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించేందుకు క్రికెట్ బెట్టింగ్ల వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఆదివారం పలువురిని ఆకట్టుకుని ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తుండగా పక్కా సమాచారంతో శింగనమల సీఐ కౌలుట్లయ్య, ఎస్ఐలు గౌస్ మహమ్మద్ బాషా (గార్లదిన్నె), విజయ్కుమార్ (శింగనమల) కల్టూరులోని రాజశేఖర్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో రాజశేఖర్తో పాటు సుధీర్రెడ్డి, భాస్కరరెడ్డి పట్టుపడ్డారు. వీరి నుంచి రూ.4,02,000 నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ

రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ