
ప్రాణం తీసిన ఓవర్టేక్
● కారును ఢీకొన్న కేఎస్ఆర్టీసీ బస్సు
● ఒకరు మృతి.. మరో నలుగురికి గాయాలు
ఉరవకొండ/ ఉరవకొండ రూరల్: ఓవర్ టేక్ ఒకరి ప్రాణాన్ని బలిగొంది. కారును కేఎస్ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధర్మవరానికి చెందిన జాన్రెడ్డి (80), చెన్నమ్మ దంపతులు తమ కుమార్తె షైనీదీప్తి, అల్లుడు రోహన్రెడ్డితో కలిసి కర్ణాటకలోని హంపి క్షేత్రాన్ని సందర్శించి శనివారం కారులో తిరుగు పయనమయ్యారు. బూదగవి సమీపంలో బళ్లారి నుంచి ఉరవకొండకు వస్తున్న కేఎస్ఆర్టీసీ బస్సు ఓవర్టేక్ చేసే క్రమంలో కారును వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న జాన్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య, కూతురు, అల్లుడుతో పాటు కారు డ్రైవర్ వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రతమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు అనంతపురం తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.