
ప్రయాణికుల బేజారు
అనంతపురం సెంట్రల్: ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థ చుక్కలు చూపించింది. సర్వీసులను రద్దు చేసి.. ప్రత్యామ్నాయం చూపకుండా ఇబ్బందులు కలిగించింది. గంటల తరబడి నిరీక్షించినా తమ రూట్ బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ఉసూరుమన్నారు. ఏపీ రాజధాని పునర్నిర్మాణంలో భాగంగా వివిధ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేసిన నేపథ్యంలో సభకు భారీగా జన సమీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం నుంచి ప్రజాప్రతినిధులు, పార్టీ ఇన్చార్జ్లకు ఆదేశాలు అందాయి. అంతే అధికారపార్టీ నేతల మెప్పు కోసం ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా బస్సు సర్వీసులను రద్దు చేశారు. జిల్లాలో అనంతపురం, గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి, ఉరవకొండ ఆర్టీసీ డిపోల నుంచి ఏకంగా 125 బస్సులు విజయవాడ కోసం కేటాయించారు. ఇవి కాకుండా మరో వంద వరకూ ప్రైవేటు ట్రావెల్స్, ప్రైవేటు స్కూల్ బస్సులను బలవంతంగా తరలించారు. వాస్తవంగా స్కూల్ బస్సులు ప్రజాప్రతినిధుల సభలకు కేటాయించడం నిబంధనలకు విరుద్ధం. అయినప్పటికీ రవాణాశాఖ అధికారులు వెళ్లాల్సిందేనని ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా నుంచి చాలా మంది స్కూల్ బస్సులలోనే తరలివెళ్లారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో విఫలం..
వేసవి సెలవులు కావడంతో చాలామంది పిల్లలతో కలిసి ఊళ్లకు, విహార యాత్రలకు, దేవస్థానాలకు వెళ్తున్నారు. కొద్ది రోజులుగా ఆర్టీసీ బస్సులకు ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఈ సమయంలో అనేక సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ అనంతపురంతో పాటు అన్ని బస్టాండ్లలో గంటల తరబడి ప్రయాణికులు బస్సుల కోసం ఎదురుచూస్తూ నిలబడి పోయారు. మధ్యమధ్యలో అరకొర బస్సులు వస్తే సీట్ల కోసం ఎగబడడం, వాదులాడుకోవడం కనిపించింది. అసలు ఏ సర్వీసులు రద్దు చేశారో.. ప్రత్యామ్నాయ బస్సులు ఎన్ని గంటలకు వస్తాయో సమాచారం కూడా డిపో అధికారులు చెప్పకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
అమరావతికి బస్సుల కేటాయింపు
ప్రత్యామ్నాయం చూపడంలో
ఆర్టీసీ విఫలం
బస్సుల కోసం ప్రయాణికులకు
తప్పని నిరీక్షణ

ప్రయాణికుల బేజారు