
జగనన్నతోనే రాష్ట్ర భవిష్యత్తు
అనంతపురం కార్పొరేషన్: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన విప్లవాత్మక మార్పులతో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి సాధించిందని, జగనన్నపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం కో ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. శుక్రవారం సిడ్నీలో వైఎస్సార్ సీపీ గ్లోబల్ కనెక్ట్ పర్యటన ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులతో ఆలూరు సాంబశివారెడ్డి సమావేశమై మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ పాలనలో సాధించిన విజయాలపై ప్రవాసాంధ్రులు ఒక్కొక్కరు చేసే ఒక్కో పోస్టుతో కలిసే ఒకమిత్రుడు రాష్ట్ర భవిష్యత్తుకు నాందీగా నిలుస్తాడని అన్నారు. తన పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు ఓటు కోసం కాకుండా ప్రతి గుండె చప్పుడు వినడానికి జగనన్న ప్రయత్నించారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలభ్యున్నతి కోసం సచివాలయాల ద్వారా సంక్షేమ పాలన, వైద్య కళాశాలలు, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య విస్తరణతో వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు, నాడు–నేడు, డిజిటల్ తరగతులు, విద్యా దీవెన ద్వారా విద్యారంగంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టి పేదలకు అండగా నిలిచారన్నారు. మరోసారి అలాంటి సువర్ణ పాలనను తీసుకురావడానికి ప్రవాసాంధ్రులు ముందుకురావాలని పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో చేసే ప్రతి పోస్టు, ప్రతి షేర్ ఓటుతో సమానమని, నిజాన్ని గణాంకాలతో ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత తీసుకుందామన్నారు. కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైఎస్సార్సీపీ కన్వీనర్ సూర్యనారాయణరెడ్డి, సిడ్నీ కన్వీనర్ అమర్, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం
కో ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి