
గ్రంథాలయాలు... విజ్ఞాన కేంద్రాలు
అనంతపురం: గ్రంథాలయాలు భవిష్యత్తు తరాలకు విజ్ఞాన కేంద్రాలని జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జ్ హోదాలో జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ అన్నారు. గ్రంథాలయాల అభివృద్ధి అంశంపై జిల్లాలోని 79 గ్రంథాలయాధికారులతో కలసి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం ఆయన సమీక్షించారు. నిర్ణీత సమయానికి గ్రంథాలయాలు తెరచి ఉంచాలన్నారు. గ్రంథాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. గ్రంథాలయా పన్నుల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పంచాయతీ, మున్సిపాలిటీ వారి నుంచి నిర్ణీత సమయంలో పన్నులు రాబట్టాలన్నారు. గ్రంథాలయాలను ఆదర్శంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వేసవి విజ్ఞాన శిబిరాలపై పాఠకులకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారిలో స్వచ్ఛందంగా సేవ చేసే దృక్పథం ఉన్న వారిని రీసోర్స్ పర్సన్లుగా ఎంపిక చేయాలన్నారు. వీరి నుంచి గ్రంథాలయాలకు వచ్చే విద్యార్థులకు డ్రాయింగ్, నృత్యం, పెయింటింగ్, సంగీత వాయిద్యాల శిక్షణ అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రెటరీ పి. రమ తదితరులు పాల్గొన్నారు.