లారీని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు | - | Sakshi
Sakshi News home page

లారీని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు

May 1 2025 12:20 AM | Updated on May 1 2025 12:20 AM

లారీన

లారీని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు

11 మందికి గాయాలు

పెద్దవడుగూరు: లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మంగళవారం రాత్రి బయలుదేరిన ఆర్టీసీ బస్సు బుధవారం తెల్లవారుజామున పెద్దవడుగూరు మండలం కాశేపల్లి టోల్‌ప్లాజా సమీపంలోకి చేరుకోగానే 44వ జాతీయ రహదారిపై ఎదురుగా వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో గుత్తి పట్టణానికి చెందిన దశకంఠేశ్వరరెడ్డి, పావని, ప్రవళిక, కర్నూలుకు చెందిన సుహేల్‌, నఫీస్‌, ఆత్మకూరుకు చెందిన శరత్‌, వెంకటేష్‌, దన్విన్‌తో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తొలుత గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి, ప్రథమ చికిత్స అంనతరం అనంతపురం, కర్నూలులోని ఆస్పత్రులకు రెఫర్‌ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పెద్దవడుగూరు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.

ప్రభుత్వాస్పత్రి ఏఓపై బదిలీ వేటు

గుంతకల్లు టౌన్‌: స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి పరిపాలనా అధికారి ఆర్‌.రామ్‌ప్రసాద్‌పై ఎట్టకేలకు బదిలీ వేటు పడింది. ఆస్పత్రిలో అవినీతి, అక్రమాలకు పాల్పడటమే కాకుండా మహిళా సిబ్బందిని వేధించారనే ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారుల విచారణ చేపట్టి రాష్ట్ర వైద్యవిధాన పరిషత్‌ కమిషనర్‌కు నివేదిక అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా ఆయనను పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి బదిలీ చేస్తూ రాష్ట్ర వైద్యవిధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.సిరి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జయవర్ధన్‌ రెడ్డి తెలిపారు.

పట్టాలపై యువకుడి మృతదేహం

రాప్తాడు: స్థానిక జేఎన్‌టీయూ మార్గంలోని పండమేరు రైల్వే బ్రిడ్జి సమీపంలో పట్టాలపై ఓ యువకుడి మృతదేహాన్ని బుధవారం ఉదయం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న ధర్మవరం జీఆర్పీ ఎస్‌ఐ దేవదాసు అక్కడకు చేరుకుని పరిశీలించారు. 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువకుడు నలుపు రంగు నైట్‌ప్యాంట్‌, కాఫీ రంగు టీ షర్ట్‌ ధరించి ఉన్నాడు. తల పూర్తిగా ఛిద్రమై మొండెం మాత్రమే మిగిలి ఉండడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో గుర్తు తెలియని మృతదేహం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

నీటి తొట్టెల నిర్మాణాలు

వేగవంతం చేయండి

కూడేరు: మండలానికి మంజూరైన పశువుల నీటి తొట్టెల నిర్మాణాలను నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలని ఉపాధి సిబ్బందిని డ్వామా పీడీ సలీంబాషా ఆదేశించారు. కూడేరులో బుధవారం ఆయన భూమిపూజ చేసి నీటి తొట్టె నిర్మాణ పనులు ప్రారంభించి, మాట్లాడారు. మండలానికి 39 తొట్టెలు మంజూరు కాగా, ఒక్కో తొట్టె నిర్మాణానికి రూ.40 వేలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పనుల్లో నాణ్యత లోపించకుండా జూన్‌ నెలాఖరుకు ఈ నిర్మాణాలు పూర్తి కావాలని సిబ్బందికి సూచించారు. అనంతరం మహిళా రైతు వెంకటలక్ష్మి పొలంలో చేపట్టిన ఫారంపాండ్‌ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లలితమ్మ, ఏపీడీ విజయ కుమార్‌, ఇంజనీర్‌ రాజేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

చీనీ ఆధారిత పరిశ్రమల

ఏర్పాటుకు స్థల పరిశీలన

గార్లదిన్నె: మండలంలోని కనుంపల్లి, జంబులదిన్నె కొట్టాలలో చీనీ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన స్థలం కోసం బుధవారం ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అధికారులు పరిశీలన చేపట్టారు. ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ అధికారి అజయ్‌కుమార్‌, జిల్లా ఉద్యాన అధికారి ఫిరోజ్‌ఖాన్‌ తదితరులు రెవెన్యూ అధికారులు గుర్తించిన ప్రభుత్వ భూమిని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ... రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందిన వెంటనే అనువైన స్థలంలో దాదాపు రూ.3.5 కోట్లతో చీనీ ఆధారిత పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మైక్రోఇరిగేషన్‌ అధికారి రఘునాథ్‌రెడ్డి, ఉద్యాన అధికారి రత్నకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

లారీని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు 
1
1/3

లారీని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు

లారీని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు 
2
2/3

లారీని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు

లారీని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు 
3
3/3

లారీని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement