
ఆర్ఎస్కే సిబ్బంది హేతుబద్ధీకరణకు ఆమోదం
అనంతపురం అగ్రికల్చర్: రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే)లో పనిచేస్తున్న సిబ్బంది హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్)కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో మంగళవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డి, ఉద్యానశాఖ డీడీ ఫిరోజ్ఖాన్, సూపరింటెండెంట్ బాషా, హెచ్ఓ రత్నకుమార్, సెరికల్చర్ ఆఫీసర్ డి.ఆంజనేయులు, టెక్నికల్ ఏఓ వెంకట్కుమార్ తదితరులు సమావేశమై చర్చించారు. రేషనలైజేషన్ లేదా రీడెప్లాయిమెంట్ (పునర్విభజన) పేరుతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 450 ఆర్బీకేలకు సిబ్బంది సర్దుబాటు ప్రక్రియ మొదలు పెట్టారు. ఉమ్మడి జిల్లా ఆధారంగా రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియను ముగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆర్ఎస్కే ఇన్చార్జిలుగా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ (వీఏఏ), విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ (వీహెచ్ఏ), విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్స్ (వీఎస్ఏ) పనిచేస్తున్నారు. అలాగే కొన్ని ఆర్ఎస్కేలకు ఔట్సోర్సింగ్ పద్దతిలో మల్టీ పర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు (ఎంపీఈఓలు) పనిచేస్తున్నారు. రేషనలైజేషన్ కింద సిబ్బందిని సర్దుబాటు చేసే క్రమంలో 1000 నుంచి 1,500 ఎకరాలకు ఒకరిని నియమించనున్నారు. 2024 ఖరీఫ్, 2025 రబీ ఈ–క్రాప్లో నమోదైన పంటల విస్తీర్ణం ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఆయా మండలాలు, గ్రామాలు, ఆర్ఎస్కేల పరిధిలో వ్యవసాయ, ఉద్యాన, మల్బరీ పంటల విస్తీర్ణాన్ని బట్టి... ఏది ఎక్కువగా ఉంటే ఆ శాఖ సిబ్బందికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.