అనకాపల్లి: జిల్లాలో మాకవరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో నమోదైన గంజాయి రవాణా కేసులో నిందితుడికి 2 సంవత్సరాల 7 నెలల జైలుశిక్ష విధిస్తూ విశాఖ 1వ అదనపు న్యాయమూర్తి ఎం.వెంకటరమణ శుక్రవారం తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. జైలు శిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధించారని, జరిమానా చెల్లించని పక్షంలో ఒక నెల సాధారణ జైలు శిక్ష అనుభవించాలన్నారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా విల్లవంకోడ్ గ్రామానికి చెందిన పుష్పరాజ్ 2023 నవంబర్ 8న ఏజెన్సీ ప్రాంతం నుంచి తమిళనాడుకు ఏడు కిలోల గంజాయిని తరలిస్తుండగా అప్పటి మాకవరంపాలెం ఎస్ఐ పి.రామకృష్ణ పట్టుకున్నట్టు ఎస్పీ చెప్పారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా వాదోపవాదాలు అనంతరం జైలు శిక్షణ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్టు తెలిపారు. కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.శ్రీనివాస్ బలమైన వాదనలు వినిపించారని చెప్పారు.


